● టీడీపీ నేత పేరుతో అనుచరుల బెదిరింపులు
● జేసీబీతో పునాదుల తొలగింపు యత్నం
● కోర్టు స్టే ఉన్నా బరితెగింపు
● జిల్లా కలెక్టర్కు కాలనీ వాసుల ఫిర్యాదు
కురబలకోట : మండలంలోని కంటేవారిపల్లి వద్దనున్న కాలనీ భూమి మాది.. వెంటనే ఖాళీ చేయాలి.. లేదంటే కూల్చి వేస్తామని మదనపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడి పేరుతో అతని అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధిత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 150 మంది దాకా ఇంటి పట్టాలు పొందారు. కొందరు పక్కా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. మరి కొందరు ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసుకున్నారు. అయితే ఈ కాలనీ ఉన్న డీకేటీ భూమి తమదేనని ఖాళీ చేయకపోతే కూల్చి వేస్తామని హెచ్చరించారు. సోమవారం కూడా జేసీబీతోపాటు రౌడీ గ్యాంగ్లతో కాలనీలో చొరబడి భయభ్రాంతులకు గురిచేసిట్లు చెబుతున్నారు. అంగళ్లుకు చెందిన మొబీనా ఇంటి పునాదిని కూడా జేసీబీతో ధ్వంసం చేశారు. కొంత కాలంగా బెదిరింపులు ఎక్కువ కావడంతో అప్పటికీ కాలనీవాసులు కోర్టుకు వెళ్లి స్టే కూడా పొందారు. అయినా ఖాళీ చేయకపోతే కాలనీ ఇళ్లను కూల్చి వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంటి పట్టాలు, కోర్టు స్టే ఉన్నా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తగు న్యాయం చేసి టీడీపీ నాయకుల బెదిరింపుల నుంచి ఆదుకోవాలని కోరుతున్నారు.


