మదనపల్లె: స్థానిక కలెక్టరేట్లో సోమవారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమ నిర్వహణ జరుగుతుందని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రితో కలెక్టర్ సమావేశాలు ఉండటంతో ఆయన అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను జేసీకి విన్నవించుకోవచ్చని కోరారు. అలాగే ఆన్లైన్ వెబ్సైట్లోనూ ఫిర్యాదులు నమోదు చేసుకో వచ్చని తెలిపారు. ఈ విధానంతో కలెక్టరేట్కు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు.
గుర్రంకొండ: చల్లంగా చూడు..రెడ్డెమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారి ఎదుట ప్రణమిల్లారు. మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మ వారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు.
మదనపల్లెటౌన్: మదనపల్లెలో ఆదివారం జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి లోకేష్ బాబు మాట్లాడుతూ స్థానిక బెంగుళూరు రోడ్డులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉండే బీటీ కళాశాల పీజీ హాస్టల్లో జిల్లా ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఇకపై మదనపల్లె జిల్లా కేంద్రంలోనే ట్రెజరీ సేవలనుసద్వినియోగం చేసుకోవచ్చనన్నారు. కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సేవలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్టీఓ లు రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, నజీర్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కడప సెవెన్రోడ్స్: వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవితా సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. నేరుగా కడప ఆర్ అండ్బీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారని పేర్కొన్నారు. ఉద యం 10 గంటల నుంచి ఒంటిమిట్ట టీటీడీ కార్యాలయంలో కోదండ రామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవం నిర్వహణపై నిర్వహించే సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారని వివరించారు.
మదనపల్లె అర్బన్: ప్రతి ఒక్కరూ మానవ హక్కులపై అవగాహన పెంచుకుని అభివృద్ధి చెందాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టీస్ కమిషన్ సంస్థ వైస్ చైర్పర్సన్ వాణి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ సభ్యులు మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ లీగల్సెల్ జాయింట్ సెక్రటరీ తుర్లు ఆనంద్యాదవ్ను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


