పుంగనూరు: ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్షంతో కౌలురైతు సాగు చేస్తున్న పూలతోటల్లోకి హంద్రీనీవా నీరు వదలడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. మండలంలోని గుడిసెబండకు చెందిన నాగరాజు చెండుమల్లెపూలతోట సాగు చేశాడు. శనివారం అధికారులు హంద్రీ–నీవా నీటిని చెరువుల్లోకి వదిలారు. కాలువలును సక్రమంగా నియంత్రించకపోవడంతో నీళ్లు వేగంగా వచ్చి పూలతోటలు, వరిపంటల్లోకి వచ్చాయి. పూలు కుల్లిపోయి రూ. లక్షల నష్టం వాటిల్లింది. తమకు నష్టపరిహారం అందించాలని రైతు నాగరాజుతో పాటు పలువురు కోరుతున్నాడు.
హత్య కేసులో నిందితుడి ఇళ్లు ధ్వంసం
మదనపల్లెటౌన్: మదనపల్లె మండలం, వలసపల్లె గ్రామం, అరవాండ్లపల్లెకు చెందిన పూల దివాకర్ జనవరిలో అదే ఊరికి చెందిన గణేష్ చేతిలో దారుణ హత్యకు గురికావడం తెలసిందే. ఈ కేసులో స్థానిక తాలూక పోలీసులు నిందితులను అరెస్టుచేసి జైలుకు పంపారు. అయితే పూల దివాకర్ను హత్య చేసిన నిందితునిపై ప్రతీకారం పెంచుకున్న దివాకర్ కుటుంబీకులు గణేష్ ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో గణేష్ కుటుంబీకులు మదనపల్లె తాలూకా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే తాలూకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో అరవవాండ్లపల్లెకు వెళ్లి గ్రామస్తులను విచారించారు. ఒకే ఊరికి చెందిన వారు కావడంతో సంయమణం పాటించాలని సూచించారు. గొడవలుపడుతూ సమస్యలు తీసుకు వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని సిఐ హెచ్చరించారు.
కంకర తొలగించమన్నందుకు
గొడ్డలితో దాడి
ప్రొద్దుటూరు క్రైం : రహదారిలో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంకరను తొలగించమని చెప్పిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని సూపర్బజార్ రోడ్డులోని శ్రీకాళహస్తి వీధికి చెందిన దుద్యాల హరి డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్లో ఇంటికి బయలుదేరాడు. ఆయన ఇంటి వద్దనే ఎలక్ట్రికల్ పని చేసే సత్యం అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం రోడ్డుపై కంకర తోలాడు. రోడ్డుకు అడ్డంగా కంకర ఉండటంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడేవారు. ఈ క్రమంలో హరి కూడా బైక్లో అదే దారిలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దీంతో అతను అక్కడే ఉన్న సత్యం వద్దకు వెళ్లి దీన్ని ప్రశ్నించాడు. రోడ్డుకు అడ్డంగా కంకర వేస్తే వాహనదారులకు ఇబ్బంది కదా.. కావున తొలగించాలని హరి సూచించాడు. ఆగ్రహించిన సత్యం నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ హరిని పరుష పదజాలంతో ధూషించాడు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లెవరూ నన్ను ప్రశ్నించలేదు, నువ్వు ప్రశ్నిస్తావా నిన్ను చంపితే ఎవరు కాపాడతారు అంటూ గొడ్డలి తీసుకొని హరి తలపై కొట్టడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. సత్యం భార్య విజయ కూడా గొడ్డలి తిరగేసి హరిని కొట్టింది. హరికి తలతో పాటు శరీరంపై గాయాల య్యాయి. హరి తల్లి సావిత్రమ్మపై కూడా ఇరువురు దాడి చేయగా ఎడమ చేతికి గాయమైంది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డు పడి హరిని, సావిత్రమ్మను కాపాడటంతో ప్రమాదం తప్పింది. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తనను చంపడానికి యత్నించిన సత్యం, అతని భార్య విజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


