రొంపిచెర్ల : రొంపిచెర్ల మండల ట్రాన్స్కో ఏడీఏ కార్యాలయాన్ని సదుం నుంచి చిత్తూరు అవతల ఉన్న రెడ్డిగుంటకు మార్పు చేశారు. సదుం ఏడీఏ కార్యాలయం అన్నమయ్య జిల్లాలో కలవడంతో.. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలకు రెడ్డిగుంట ఏడీఏ కేంద్రంగా ప్రభుత్వం శుక్రవారం మంజూరు చేసింది. ఈ రెండు మండలాలకు సదుం అనుకూలంగా ఉండేదని, ఏవైనా సమస్యలు ఉంటే వినియోగదారులు, రైతులు నేరుగా ఏడీఏను కలిసి పరిష్కరించుకునే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. అయితే సదుం నుంచి రెడ్డిగుంటకు రెండు మండలాలను కలపడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అయితే పక్కనే ఉన్న సదుం, సోమల మండలాలకు సదుంలోనే ఏడీఏ కార్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే ఎర్రావారిపాల్యెం, చిన్నగొట్టిగల్లు మండలాలకు చిన్న గొట్టిగల్లులో ఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలకు పులిచెర్లలో ఏడీఏ కార్యాలయం ఏర్పాటు చేస్తే సరి పోతుందని రైతులు తెలిపారు. అయితే రెడ్డిగుంటకు పోవాలంటే 75 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం రైతులు ఏడీఏ కార్యాలయానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం రొంపిచెర్ల మండలంలో విద్యుత్ శాఖలో 50 శాతం సిబ్బంది కొరత ఉందని, ఇలా చేయడం వల్ల ఉన్న సిబ్బంది పూర్తిగా ఇతర మండలాలకు బదిలీపై వెళ్లే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు. త్వరలో మళ్లీ నియోజకవర్గాలు మారే అవకాశం ఉందని, అప్పటి వరకు యాథావిధిగా ఏడీఏ కార్యాలయాలు ఉండాలని, లేకపోతే వినియోగదారులకు సౌకర్యంగా పులిచెర్లలో ఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వినియోగదారులు, రైతులు కోరుతున్నారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు


