మదనపల్లె టౌన్ : శ్రీరామ నవమి రోజే ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండుగ పూట చింతకాయలు కోయడానికి కూలీకి వెళ్లిన యువకుడు చెట్టుపై నుంచి కిందపడి మృత్యువాత పడ్డాడు. పిటిఎం మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనపై మృతుడి కుటుంబీకులు, పిటిఎం పోలీసులు తెలిపిన వివరాలు.. పెద్దతిప్పసముద్రం మండలంలోని కమ్మచెరువుకు చెందిన నరసింహులు కుమారుడు పి.విశ్వనాథ్(33)కు భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఊరిలో అందరూ నవమి పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పక్క వీధికి చెందిన ఓ వ్యక్తితో కలసి చింత కాయలు కోయడానికి కూలీ పనికి విశ్వనాథ్ వెళ్లాడు. చాకలోని బావి వద్ద చెట్టెక్కి కాయలు కోస్తుండగా పట్టుజారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఓ ప్రయివేట్ వాహనంలో హుటా హుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితున్ని తిరుపతికి తరలిస్తుండగా వాల్మీకిపురం సమీపానికి వెళ్లగానే విశ్వనాథ్ మృతి చెందాడు. పండుగ రోజు విశ్వనాథ్ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ యజమాని ఇక లేడని తెలియగానే భార్య సునీత, వారి పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీరామ నవమి పండుగను కూడా చేయనీకుండా ఆదేవుడు తన భర్తను పైకి తీసుకెళ్లాడని విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది. ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని పిటిఎం పోలీసులు తెలిపారు.


