మదనపల్లె టౌన్ : తేనెటీగల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇందుకు సంబంధించి బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలంలోని కోటవారిపల్లె గ్రామం గూటంవారిపల్లెకు చెందిన గోపాల్రెడ్డి భార్య సిద్దమ్మ(60) ఊరికి సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న చింత చెట్టుకింద కూర్చొంది. అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగల గుంపు సిద్దమ్మపై దాడి చేశాయి. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు కేకలు వేడంతో స్థానికులు వచ్చి ఆమెను ఓ ప్రయివేట్ వాహనంలో హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది.
మినీ బస్సును ఢీకొన్న కారు
బి.కొత్తకోట : అంగళ్లు నుంచి బి.కొత్తకోటకు వెళ్తున్న ఓ కళాశాలకు చెందిన మినీబస్సును కారు ఢీకొన్న సంఘటన మంగళవారం మండలంలోని మొగసాలమర్రి వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అంగళ్లకు చెందిన కళాశాల మినీ బస్సు బి.కొత్తకోటలో విద్యార్థులను దింపేందుకు వెళ్తుండగా.. మదనపల్లె నుంచి బి.కొత్తకోటకు కారులో వెళ్తున్న ఎస్ఎల్వీ బేకరి నిర్వహిస్తున్న రవిరాజ్ (36) మినీబస్సును వెనుకవైపు ఢీకొన్నాడు. ఈ ఘటనలో మినీ బస్సు అదుపుతప్పి కుడివైపు పోలాల్లోకి దూసుకెళ్లి ముందరి భాగం ధ్వంసమైంది. కారులో వస్తున్న రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్లో బాధితున్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రి తరలించారు.


