సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని పలు గ్రామాల్లో పులివెందుల రూరల్ సీఐ సీతారామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన చిన్న ఓబుళరెడ్డి ఇంట్లో ఉన్న 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దుకాణంలోకి
దూసుకొచ్చిన ట్రాక్టర్
రాజంపేట : పట్టణ పరిధి రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ స్టీల్, సిమెంట్ దుకాణంలోకి శనివారం ఇసుక ట్రాక్టర్ దూసుకొచ్చింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.
చక్రాయపేట
ఎంపీపీ ఇంట్లో చోరీ
వేంపల్లె : వేంపల్లెలోని శ్రీచైతన్య పాఠశాల ప్రాంతంలో నివాసముంటున్న చక్రాయపేట ఎంపీపీ మాధవీ బాలకృష్ణ ఇంట్లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు, అర్ధ కేజీ వెండి ఆభరణాలు గుర్తు తెలియని దుండుగులు అపహరించారు. బాధితుడు బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాది, రంజాన్ పండుగలు సందర్భంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో పిల్లలను తీసుకొని సొంత గ్రామమైన చక్రాయపేట మండలం సురభి గ్రా మంలోని మలికివాండ్లపల్లెకు ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. శనివారం సాయంత్రం బాలకృష్ణ సోదరి లక్ష్మీదేవి శుభ కార్యానికి పిలవడానికి వేంపల్లెకు రావడం జరిగింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో సోదరుడు ఇంట్లో ఉన్నాడని వెళ్లి చూడగా.. రెండు బీరువాలు తెరిచి ఉండటం గమనించింది. దొంగలు పడ్డారనే భయంతో సోదరుడైన బాలకృష్ణకు ఫోన్ చేసింది. తాము మలికివాండ్లపల్లెలో ఉన్నామని, ఏమి విషయం అని అడగగా.. మీ ఇంట్లో చోరీ జరిగిందని, త్వరగా రావా లని చెప్పడంతో ఆయన వెంటనే వచ్చారు. ఇల్లు, పరిసరాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు బీరువాలను పరిశీలించగా 5 తులాలకు సంబంధించిన రెండు బంగారు చైన్లు, కమ్మలు, ఉంగరాలతోపాటు అర్ధ కేజీ వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. ఈ మేరకు ఆయన వేంపల్లె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశా రు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకు ని పరిశీలించారు. వారు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. మండలంలోని వేంపల్లేలో, పాపా ఘ్ని నది సమీపంలో ఉన్న శ్రీదుర్గా గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో ఒకే రోజు చోరీలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ప్రాణం తీసిన ఈత సరదా
కడప అర్బన్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రంజాన్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు. స్నేహితులతో కలిసి వెళ్లి బావిలో మునిగి ప్రాణాలు వదిలిన సంఘటన కడప నగరం రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రిమ్స్ పోలీసుల వివరాల మేరకు.. కడప బీడీ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ హనీఫ్ (28) తన తండ్రితోపాటు తిరుపతిలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. రంజాన్ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బుడ్డాయిపల్లె వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లి ఈత కొట్టాడు. కొద్దిసేపటికి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


