కడప అగ్రికల్చర్: కడప జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, బలమైన ఈదురు గాలులు జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన పంటలను అతలాకుతలం చేశాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కళ్లముందే నేలకొరగడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
అరటి రైతులకు కోలుకోలేని దెబ్బ
జిల్లాలో ప్రధానంగా 52 హెక్టార్లలో అరటి పంట దెబ్బతింది. సుమారు 62 మంది రైతులకు రూ.156 లక్షల (1.56 కోట్లు) మేర నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
సింహాద్రిపురం మండలం: సింహాద్రిపురంలో 20 హెక్టార్లు (రూ.60 లక్షలు), కసనూరులో 17 హెక్టార్లలో (రూ. 51లక్షలు) పంట దెబ్బతింది.
ముద్దనూరు మండలం: బొందలకుంట గ్రామంలో 12 మంది రైతులకు చెందిన 6 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 18 లక్షల నష్టం వాటిల్లింది.
తొండూరు మండలం: బుచుపల్లిలో 5 మంది రైతులకు సంబంధించి 5 హెక్టార్లలో రూ. 15 లక్షల నష్టం జరిగింది.
రాజంపేట మండలం: పెద్దకారంపల్లిలో ముగ్గురు రైతులకు సంబంధించి 2 హెక్టార్లలో రూ. 6 లక్షలు, బ్రాహ్మణపల్లెలో ఇద్దరు రైతులకు సంబంధించి 2 హెక్టార్లలో రూ. 6 లక్షల నష్టం వాటిల్లింది.
మొక్కజొన్న: కొండాపురం, కమలాపురం, వీఎన్పల్లి, సింహాద్రిపురం మండలాల్లోని 21 గ్రామాల్లో 71.40 హెక్టార్లలో పంట నేలపాలైంది. సింహాద్రిపురం–2 గ్రామంలో 16 హెక్టార్లు, వీఎన్పల్లి ఇందకూరులో 8 హెక్టార్లలో నష్టం జరిగింది.
సజ్జ: వీఎన్పల్లి, కాశినాయన, కొండాపురం మండలాల్లో 27 హెక్టార్లలో సజ్జ పంట దెబ్బతింది. వీఎన్పల్లిలో 12 హెక్టార్లు, కాశినాయన మండలం ఉప్ప లూరులో 7 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.
వైఎస్సార్ కడప జిల్లాలో నేలకొరిగిన అరటి, మొక్కజొన్న, సజ్జ పంటలు
సుమారు 150 హెక్టార్లలో పంట నష్టం..అవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు


