మదనపల్లె సిటీ: రంజాన్ పండుగ నేపథ్యంలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 21న జరగాల్సిన ఈ పరీక్ష, వచ్చే నెల (ఏప్రిల్) 2వ తేదీన జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. 21వ తేదీ విధులకు కేటాయించిన ఇన్విజిలేటర్లు ఏప్రిల్ 2న యథావిధిగా హాజరుకావాలని ఆయన సూచించారు.
రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని వెలసిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్కుమార్, ఈవో వి. రమణారెడ్డిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. రాహుకాల పూజల విశిష్టతను చాటుతూ అమ్మవారికి నిమ్మకాయల హారాలను సమర్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాహుకాల పూజల వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీపీజీసెట్ (APPGCET)–2026 దరఖాస్తు గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ డాక్టర్ టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ్చఞ. జౌఠి. జీుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సందేహాల కోసం 8317532040, 8106604789 నంబర్లను సంప్రదించవచ్చు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఉచితంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు.


