యువకుడి అదృశ్యం
మైదుకూరు : మండలంలోని జాండ్లవరం గ్రామానికి చెందిన డప్పిలి సుబ్బరాజు అనే 30 ఏళ్ల యువకుడు కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందినట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. తన కుమారుడు ఈ నెల 5వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, అతని ఆచూకీ కనుగొనాలని యువకుని తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు చేశారని సీఐ వివరించారు. యువకుని ఆచూకీ తెలిసిన వారు సీఐ నంబర్ 9121100618, ఎస్ఐ నంబర్ 9121100619 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
కబేళాకు తరలిస్తున్న ఎద్దుల పట్టివేత
కొండాపురం : మండల పరిధి ముచ్చుమర్రి పునరావాస కేంద్రం సమీపంలోని కడప– తాడిపత్రి జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేస్తుండగా.. ఆరు ఎద్దులను అక్రమంగా వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ జయరాములు మంగళవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. కడప వైపు నుంచి అనంతపురానికి ఎద్దులను తరలిస్తున్న బొలెరో క్యాంపర్ వాహనాన్ని పోలీసులు ఆపి డ్రైవర్ను విచారణ చేశారు. ఈ సందర్భంగా కబేళాకు తరలిస్తున్న నార్పలకు చెందిన మణికంఠతోపాటు ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వాహనంలో తీసుకొస్తున్న సమయంలో ఎద్దులు గాయాల పాలు కావడంతో మండల పశువైద్యుడు రాజశేఖర్రాజుతో వైద్య చికిత్సలు చేయించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అనంతరం వాటిని పోలీస్స్టేషన్ ఆవరణలో ఉంచారు.
కడప నగరంలో చోరీలపై కేసులు
కడప అర్బన్ : కడప నగరంలోని పలు చోట్ల దొంగలు పడి బంగారు నగలు అపహరించారని పత్రికలలో కథనాలు మంగళవారం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిల్లో మొత్తం 82 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాములు వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసులను నమోదు చేశారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. కడప నగరం శిల్పారామం సమీపంలోని ఇంట్లో దొంగల పడి బంగారు నగలు అపహరించినట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు. రిమ్స్ సమీపంలో ఉన్న నాగలక్ష్మి మెడికల్ కాలేజీలో ఉద్యోగిగా పని చేస్తోంది. నాలుగు రోజుల క్రితం ఊరికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడి 12 గ్రాముల బంగారు నగలు అపహరించినట్లు తెలిపారు. అలాగే వైఎస్సార్ కాలనీలో నాగరాజు అనే లారీ డ్రైవర్ ఇంట్లో దొంగల పడి 50 గ్రాముల బంగారు నగలు అపహరించారు. ఆయన కడప టౌన్లోని వారి బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో వెళ్లడంతో దొంగలు ఇంట్లో పడి చోరీలకు పాల్పడినట్లు చిన్నచౌకు ఎస్ఐ ప్రతాపరెడ్డి తెలిపారు. కడప ఎరమ్రుక్కపల్లెలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి మునిస్వామి ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడి 20 గ్రాముల బంగారు నగలు 200 గ్రాముల వెండి వస్తువులు అపహరించినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వెళ్లారని, దొంగలు ఆ ఇంటి తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు తెలిపారు.
యువకుడి అదృశ్యం


