ఓటు హక్కు మాత్రమే కాదు.. బాధ్యత
మదనపల్లె రూరల్: ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఆదివారం ఉదయం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఓటరు అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఓటు ప్రాధాన్యత నినాదాలు చేస్తూ విద్యార్థులు బీటీ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ మాట్లాడుతూ. భారత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండేందుకు ఓటు పునాది అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ ఓటుతోనే సాధ్యమని, ఓటు మన భవిష్యత్తు అన్నారు. ఓటుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, తమకు ఎలాంటి నాయకుడు కావాలో వారే ఓటుద్వారా ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం ప్రజలకు కల్పించిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుచేసుకోవాలన్నారు. ఓటు వేసినప్పుడే, హక్కుల కోసం ప్రశ్నించే అవకాశం వస్తుందన్నారు. ఓటు వేయడంపై చాలా మంది నిర్లక్ష్యం కనపరుస్తుంటారని, ముఖ్యంగా యువత తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. 70 సంవత్సరాలు వయస్సు పైబడి, ఎన్నికల్లో ఎక్కువసార్లు ఓటుహక్కు వినియోగించుకున్న నలుగురు సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు ఓటరు గుర్తింపుకార్డులు అందజేశారు. ఓటరు దినోత్సవంపై వ్యాసరచన, వక్తృత్వపోటీల్లో ప్రతిభ చూపిన పిల్లలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మదనపల్లె తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి, డీటీ రాఘవేంద్ర, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం
ఓటు ప్రాధాన్యతను తెలిపేలా మదనపల్లెలో ర్యాలీ
ర్యాలీని జెండాఊపి ప్రారంభించిన జేసీ శివనారాయణ శర్మ
సీనియర్ సిటిజన్స్కు సన్మానం


