కార్మిక నాయకుడు కామ్రేడ్ రఫీక్ కన్నుమూత
కడప సెవెన్రోడ్స్ : రాయచోటి పట్టణానికి చెందిన కార్మిక నాయకుడు, వామపక్ష అభిమాని కామ్రేడ్ రఫీక్(80) ఆదివారం తన స్వగృహంలో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. టైలర్ వృత్తి ద్వారా ఆయన జీవనం కొనసాగించే వారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు అభిమానులు తెలిపారు. గతంలో ఆయనకు సీపీఐ (ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గీయులతో పరిచయాలు ఉండేవి. ఆ రాజకీయ ప్రేరణతో రాయచోటి పట్టణంలో బీడీ కార్మికులను ఏకం చేసి వారి సమస్యలపై పలు పోరాటాలు నిర్వహించారు. పట్టణ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటూ పలు ఆందోళనలు నిర్వహించారు. రాయలసీమ ఉద్యమంలో అప్పటి కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని పలుమార్లు అరెస్టు అయ్యారు. 1992లో సారా వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పటి జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యురాలు రామలక్షుమ్మ, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆదినారాయణస్వామి, రాయలసీమ పౌరహక్కుల సంఘం కన్వీనర్ ఎంజే సుబ్బరామిరెడ్డి, కడప మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.హరీంద్రనాథ్, అప్పటి టీడీపీ నాయకుడు మైఖేల్ విజయ్కుమార్, జనతాదళ్ యువ నాయకుడు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి తదితరులతో కలిసి సారా వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యుడు విశ్వనాథరెడ్డి, రైతు నాయకుడు సాదు జయచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాబకష్, పాత్రికేయుడు ఫణి తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


