
4న తలనీలాల వేలం
సిద్దవటం : మండల పరిధి వంతాటిపల్లి గ్రామ పంచాయతీ లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజస్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ హక్కుకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు సిద్దవటం శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు లక్ష రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. పాట ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుడు పూర్తి మొత్తం చెల్లించి రశీదు పొందాలని వివరించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
చిన్నమండెం : మండలంలోని దేవగుడిపల్లి ఆర్చి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలైనట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దేవగుడిపల్లి కస్పాకు చెందిన నాగరాజు కుమారుడు విశ్వ చిన్నమండెం నుంచి దేవగుడిపల్లికి వస్తుండగా కడప–బెంగళూరు జాతీయ రహదారిపై దేవుడుపల్లి ఆర్చి వద్దకు వచ్చేసరికి చిన్నమండెం మండల కేంద్రంలోని అరబిక్వీధికి చెందిన సాదిక్, జాఫర్, శేషావలి రాయచోటి వైపు నుంచి వస్తూ విశ్వ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విశ్వాను తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా శేషావలి, సాదిక్, జాఫర్ అతివేగంతో వచ్చి విశ్వను ఢీకొనట్టినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మైనర్లకు బైక్లు ఇచ్చిన వారిపై కేసులు
రాజంపేట టౌన్ : మైనర్లకు బైక్లు ఇచ్చేవారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఏఎస్పీ మనోజ్ రామనాఽథ్ హెగ్డే హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్పై డ్రోన్ సహాయంతో మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బైక్లు నడిపే మైనర్లను గుర్తించి అర్బన్ పోలీస్ స్టేషన్లో వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే మైనర్లు బైక్లు నడుపుతున్నారన్నారు. దీని వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదన్నారు. మైనర్లకు బైక్లు ఇస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ బి.నాగార్జున, ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బస్సులో బంగారు
నగలు చోరీ
ముద్దనూరు : స్థానిక పాత బస్టాండులో ఆర్టీసీ బస్సులో ఎక్కిన మహిళనుంచి నాలుగున్నర తులం బంగారు నగలు చోరీ అయ్యాయి. ఏఎస్ఐ రమేష్ సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండలంలోని దేనేపల్లెకు చెందిన లక్ష్మీప్రసన్న అనే మహిళ తన బ్యాగులోని పర్సులో నల్లపూసల దండ, బంగారు హారం పెట్టుకుని పోట్లదుర్తి గ్రామానికి వెళ్లేందుకు తన ఇద్దరు చిన్న పిల్లలతో కలసి పాతబస్టాండులో ప్రొద్దుటూరు బస్సు ఎక్కింది. పాత బస్టాండు నుంచి 4 రోడ్ల కూడలికి వెళ్లిన తర్వాత టికెట్ కోసం పర్సులో వున్న ఆధార్కార్డు చూపించడానికి పర్సుకోసం చూడగా బ్యాగులో పర్సులేదని గుర్తించింది. పర్సు దొంగిలించినట్లు తెలుసుకుని వెంటనే బస్సులో నుంచి దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.

4న తలనీలాల వేలం