
కామాంధుడికి దేహశుద్ధి
– భయాందోళన చెందుతున్న మహిళలు
గుర్రంకొండ : సెల్ ఫోన్లో మహిళల ఫొటోలు తీస్తూ వికృతానందం పొందుతున్న ఓ కామాంధుడికి గ్రామస్తులు, మహిళలు దేహశుద్ధి చేశారు. మండల కేంద్రం గుర్రంకొండలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిరు వ్యాపారాలు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. గత సోమవారం కొత్తపేట వీధిలో సంచరిస్తూ వీధుల్లో నడిచి వెళ్తున్న మహిళల ఫొటోలు తీశాడు. వీధి వెంబడి వెళుతున్న ఓ మహిళ అనుమానం కలిగి సదరు వ్యక్తి సెల్ ఫోన్ను లాక్కొని పరిశీలించగా ఫోటోలు ఉండడం గమనించింది. గట్టిగా నిలదీయడంతో చుట్టుపక్కల వారు చేరుకొని సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు. కొంతమంది అతడి ఫోన్ను పూర్తిస్థాయిలో పరిశీలించగా గ్రామం లోని పలు ప్రాంతాలకు చెందిన 500మందికి పైగా మహిళల ఫోటోలు ఉండడంతో నివ్వెరపోయారు. గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి కఠినచర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాల వ్యాన్ ఢీకొని ఒకరు మృతి
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మంగళవారం ఓ పాల వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఎన్.సుబ్రహ్మణ్యం(58) మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. మోటకట్లకు చెందిన సుబ్రహ్మణ్యం శివాలయం సమీపంలో స్కూటర్పై వస్తున్నారు. రాయచోటి వైపు నుంచి వస్తున్న పాలవ్యాన్ ఇతడి స్కూటర్ను ఢీకొంది. తీవ్రగాయాలైన సుబ్రహ్మణ్యంను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
4న వాహనాల వేలం
రాజంపేట : రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలకు అక్టోబరు 4న వేలంపాట నిర్వహిస్తున్నట్లు రాజంపేట మోటారు వెహికల్ అధికారి తెలిపారు. తనిఖీలలో పట్టుబడిన వాహనాలను రాజంపేట ఆర్టీసీ డిపోలో ఉంచామన్నారు. ఆసక్తి గల వారు ఉదయం పది గంటల నుంచి 11 గంటల లోపు రూ.5 వేల ధరావతు చెల్లించాలన్నారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి టోకన్ తీసుకోవాలన్నారు. వేలం వేసే వాహనాల వివరాలు అన్నమయ్య జిల్లా కార్యాలయం నోటీసు బోర్డులో ఉన్నాయన్నారు.
గంజాయి మత్తులో
కూలీలపై దాడి
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని రెడ్డివారిపల్లి వంతెన వద్ద పనిచేస్తున్న కూలీలు దేవరాజునాయుడు, మల్లికార్జునలపై కొందరు యువకులు గంజాయి మత్తులో మంగళవారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు గుర్తించి హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. వైఎస్సార్సీపీ నాయకులు సీహెచ్.రమేష్, బుడుగుశివయ్య బాధితులను పరామర్శించారు. విషయం తెలుసుకొన్న పోలీసలు కేసు నమోదు చేసి దాడి చేసిన వారిలో మణికంఠ, కార్తీక్, మరొకరిని అరెస్ట్ చేసారు.
కోడిపందెం రాయుళ్ల అరెస్టు
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ పరిధిలోని దిగువ అబ్బవరం హరిజనవాడ ప్రాంతంలో కోడి పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ సిబి.చలపతి తెలిపారు. ఎస్సీ ధీరజ కునుబిల్లి ఆదేశాల మేరకు పట్టణం, మండలంలోని పలు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టామన్నారు. మంగళవారం దిగువ అబ్బవరం గ్రామంలోని పొలాల వద్ద కోడి పందెం ఆడుతున్నట్లు తెలియడంతో దాడులు నిర్వహించి 12 మందిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.25 వేల నగదు, 26 స్కూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వా రిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పెడుతున్నట్లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వస్థ నారీ శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మధుమేహ, రక్తపోటు పరీక్షలు, టీబీ శాంపిల్ కలెక్షన్, కిశోర బాలికలకు అవగాహన తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. డైరీ అండ్ ఎంఎఫ్–2 రిజిష్టర్ గురించి తెలుసుకొని సూచనలు చేశారు. అనంతరం వెక్టార్ కంట్రోల్, ప్రైడే డ్రైడేలను క్షుణ్ణంగా పరిశీలించారు. డాక్టర్ ఎస్ జియాఉల్లా, సిబ్బంది జయరామయ్య, దేవదానం పాల్గొన్నారు.

కామాంధుడికి దేహశుద్ధి

కామాంధుడికి దేహశుద్ధి

కామాంధుడికి దేహశుద్ధి