దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ! | - | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!

Jun 16 2025 5:37 AM | Updated on Jun 16 2025 6:01 AM

రాజంపేట : పెనుశిల శ్రీ లక్ష్మీనరసింహ అభయారణ్యంలో 18 కిలోమీటర్ల మేర ఘాట్‌రోడ్డులో ఎండిన కట్టెలే రక్షణ గోడ(ప్రొటెక్షన్‌ వాల్‌)గా కనిపిస్తోంది. దీనిపై సంబంధిత శాఖ దృష్టి సారించలేదు. నిధులు లేవమో కట్టెలే ప్రొటెక్షన్‌ వాల్‌గా ఏర్పాటు చేసి పనులు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఘాట్‌రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆయన మరణాంతరం ఏర్పడిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నెల్లూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు ఘాట్‌ రోడ్డు అభివృద్ధిపై దృష్టి సారించాలని వాహదారులు కోరుతున్నారు. అధికారంలో లేనప్పుడు ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రోడ్ల దుస్థితిని పట్టించుకోవడం లేదు.

కట్టెలే.. రక్షణ గోడగా..

రోడ్డు వెంట అక్కడక్కడా రక్షణ గోడ కూలిపోయింది. దాన్ని పునఃనిర్మించలేదు. కొన్ని చోట్ల కట్టెలు ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో వదిలేశారు. కేవలం ప్యాచింగ్‌ పనులతో కాలయాపన.. మరమ్మతులతో కాలం నెట్టుకొస్తున్నారు. మొత్తం మీద ఈ రోడ్డులో 30 మలుపులు ఉన్నప్పటికీ, ఇందులో కొన్ని ప్రమాదకర సంఘటనలకు తావిచ్చిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్డు కుచించుకుపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో అధ్వానంగా తయారైంది.

ఉభయ జిల్లాలకు..

ఉభయ జిల్లాలో రాజధానికి రా‘పూర్‌’ ఘాట్‌ రోడ్డును రెండవ రహదారిగా వినియోగించుకుంటున్నారు. అనంతపురం, కదిరి, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలకు చెందిన వారు ఈ రోడ్డు మార్గంలో.. నెల్లూరు, కావలి, ఒంగోలు, విజయవాడ, బెజవాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.

ఎదురెదరుగా వాహనాలు వస్తే..

రాపూరు–చిట్వేలి మధ్య ఉన్న ఘాట్‌రోడ్డులో ఎదురెదరుగా వాహనాలు వస్తే అతిజాగ్రత్తగా ఉండకపోతే లోయలోకి పడాల్సి వస్తుంది. మలుపులు వద్ద పటిష్టమైన చర్యలు ఏమీకనిపించవు. చిన్నచిన్నపిట్టగోడలు తప్ప..వాటిని వాహనాలు అదుపుతప్పి ఢీకొన్న తట్టుకోలేని పరిస్ధితులు ఉన్నాయి. మలుపుల వద్ద రెండు వాహనాలు ఎదురుపడితే దాటుకోవడానికి వాహనదారులు కష్టాపడాల్సి వస్తుంది. లోయలో పడిపోతామో అన్న భయాందోళనను ఈ రోడ్డు తలపిస్తోంది. సింగల్‌రోడ్డు కావడంతో రోడ్డుకు ఇరువైపు గుంతలు..ఆనుకొని పిట్టగోడలు ఇక పరిస్ధితి చెప్పనక్కర్లేదు.

రాష్ట్ర విభజనతో రద్దీగా..

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానికి వెళ్లేందుకు ఈ ఘాట్‌రోడ్డు అనుకూలమైనప్పటికి ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం కొనసాగించాల్సిందే. అమరావతికి ఇప్పుడు ఈ రోడ్డు మార్గం మీదుగా వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఆర్టీసీ విజయవాడకు బస్సులను నడిపిస్తోంది. ఘాట్‌రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రైవేటు బస్సులు ఇంకా నడిపేందుకు యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఉదయం నుంచి నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వారు.. ఈ మార్గంలో ప్రయాణించడం ఇటీవల అధికమైందని చెప్పవచ్చు. గతంలో ఈ రోడ్డును స్టేట్‌హైవేగా ప్రకటించి.. మళ్లీ ఆర్‌అండ్‌బీకి ఇచ్చేశారు. రాపూరు నుంచి వచ్చేటప్పుడు ఘాట్‌ రోడ్డు అధ్వానంగా తయారైంది.

గతంలో ప్రమాదాలిలా..

రాపూరు ఘాట్‌ రోడ్డులో గత ప్రమాదాలను ఒక సారి పరిశీలిస్తే.. ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో తెలిసిపోతుంది. ఇప్పటి వరకు 32 మందికి పైగా ప్రమాదాల బారిన పడి మృత్యువాతకు గురయ్యారు.

● 1983లో పెళ్లి బృందం బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అయి లోయలోపడి ఇద్దరు మృతి చెందారు.

● 2007 మే 5న ఏకంగా ఐదుగురు మృతి చెందారు.

● 2007లో వరద తాకిడికి కదిరి బస్సు చిక్కి ఆరుగురు మృత్యువాత పడ్డారు.

● 2008 జూన్‌ 3న వాకాడు బస్సు లోయలో పడి ముగ్గురు మృతి చెందారు.

● 2008 సెప్టెంబరులో రైల్వేకోడూరు బస్సు లోయలోపడి 14 మంది మృతి చెందారు.

● 2008 అక్టోబరులో ఘాట్‌ మలుపులో లారీ, బస్సు, స్కూటర్‌ ఢీకొని భార్యభర్తలు మృతి చెందారు.

మోక్షం లభించేనా..!

రాష్ట్ర విభజనతో రాజధానికి రాజంపేట–నెల్లూరు రహదారి రోడ్డు ప్రధానమైనప్పటికీ.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయడం లేదు. రోడ్డు విస్తరణతోపాటు డబుల్‌ రోడ్డుగా చేసి ప్రమాద రహిత రహదారిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికుల నుంచి డిమాండ్‌ వస్తోంది. ఇటు కడప, అటు నెల్లూరు జిల్లాలకు చెందిన పాలకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఆవశ్యత ఎంతైనా ఉందని చెపుతున్నారు. రాజధానికి అన్ని మార్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పుకొనే రోడ్ల మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి.. ముందు రాజధానికి ఉన్న రోడ్డును అభివృద్ధి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

దారుణంగా పెనుశిల ఘాట్‌ రోడ్డు

18 కిలోమీటర్లు.. 30 మలుపులు

భయం.. భయంగా ప్రయాణం

జిల్లాలో రాజధానికి వెళ్లే రెండవ మార్గం

పట్టించుకోని కూటమి సర్కారు

పడితే లోయలోకి వెళ్లాల్సిందే

అమరావతి (విజయవాడ)కి వెళ్లే రహదారి ఘాట్‌ రోడ్డులో ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తోంది. రాపూరు నుంచి వచ్చేటప్పుడు ఘాట్‌ రోడ్డు అధ్వానంగా తయారైంది. సింగల్‌రోడ్డు కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది జరుగుతోంది. రోడ్డు కుచించుకుపోయింది. కొన్ని చోట్ల ప్రొటెక్షన్‌ వాల్స్‌ లేవు. పడితే నేరుగా లోయలోకి వెళ్లాల్సిందే. నెల్లూరు, అన్నమయ్య జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలి.

–మర్రికళ్యాణ్‌, ఎన్‌ఆర్‌ఐ, రాజంపేట

డబుల్‌ రోడ్డుగా మార్చాలి

రాజంపేట నుంచి విజయవాడ, నెలూరు ప్రాంతాలకు వెళ్లే రహదారిలో రాపూరు ఘాట్‌ రోడ్డు అధ్వానంగా తయారైంది. నిత్యం వందలాదిగా భక్తులు పెంచలకోనకు వెళుతుంటారు. డబుల్‌రోడ్డుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోడ్డులో ప్రమాద నివారణ చర్యలు ఏవీ కనిపించడం లేదు. రక్షణ గోడల స్థానంలో కట్టెలు పెట్టడం ప్రభుత్వ దుస్థితికి అద్దం పడుతుంది.

–బి.శ్రీరాముల వడ్డెర, జిల్లా అధ్యక్షుడు, వడ్డెర సంఘం

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!1
1/4

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!2
2/4

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!3
3/4

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!4
4/4

దెబ్బతిన్న ప్రహరీ.. పడితే హరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement