తండ్రికి మించిన తనయుడిగా వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రజాసంకల్ప యాత్ర
సుపరిపాలనకు నాందిపలికిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ పాదయాత్రలు
కొనియాడిన వైఎస్సార్సీపీ నాయకులు
వైఎస్సార్ ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు
సాక్షి, అమరావతి: ‘మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర దేశంలోనే ఎప్పటికీ ప్రత్యేకమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రలు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనకు నాందిపలికాయి. తండ్రి, కుమారుడు పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వాటిని పరిష్కరించిన ఘనత దేశంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుంది’ అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశంసించారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజలతో మమేకమవుతూ..
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి మండుటెండలో తెలంగాణలోని చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. సాధారణ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత సంక్షేమ పాలనకు బాటలు వేసింది. వైఎస్సార్ పాదయాత్ర కారణంగానే 2004లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది.
కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి కూడా కారణమైంది. వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తండ్రికి మించిన తనయుడిగా నిలిచారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకొచ్చి అద్భుత పాలనను అందించారు.’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, కాకమాను రాజశేఖర్, చల్లా మధు తదితరులు పాల్గొన్నారు.


