రైతును లాకప్‌లో పెట్టి కొడతారా? | YSR Congress party staged a dharna in front of police station | Sakshi
Sakshi News home page

రైతును లాకప్‌లో పెట్టి కొడతారా?

May 10 2026 5:51 AM | Updated on May 10 2026 5:51 AM

YSR Congress party staged a dharna in front of police station

మండుటెండలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

విద్యుత్‌ కనెక్షన్‌ అడగడమే నేరమా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపాటు

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

పొదలకూరు : ‘అమాయక రైతులను కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు ? వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకుల మాటలు వింటూ పోలీసులు చేయిచేసుకుంటున్నారు. వారందరిని న్యాయస్థానంలో దోషులుగా నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ నాయకులు చెప్పారని మండలంలోని నావూరుపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ వెంగయ్య కుమారుడు గాలం హరికృష్ణను ఎస్‌ఐ హనీఫ్‌  స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టడాన్ని గర్హిస్తూ.. శనివారం  మండుటెండలో కాకాణి ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు.

పలు గ్రామాల నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎస్‌ఐను వెంటనే సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. హరికృష్ణను ఏ కేసులో స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టారో చెప్పాలని సీఐ వెంకట్రావును కాకాణి ప్రశ్నిం చారు. ఫిర్యాదు లేదు.. కేసు నమోదు లేదు.. హరికృష్ణను ఎందుకు కొట్టారని నిలదీశారు. పౌరుడిని కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నిం చారు. 

ఎస్‌ఐ హనీఫ్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బెదిరిస్తూ దుర్మార్గంగా కొడుతున్నట్టు కాకాణి పేర్కొన్నారు. తమ కార్యకర్తలను కొట్టే దృశ్యాలను వీడియో కాల్‌ చేసి టీడీపీ నాయకులకు చూపుతున్నట్లు ధ్వజమెత్తారు. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న రైతు హరికృష్ణ నిమ్మ తోటలకు వ్యవసాయ విద్యుత్‌ సర్విస్‌ కోసం విద్యుత్‌ ఏఈని ప్రశి్నస్తే ఎస్‌ఐ పిలిపించి కొట్టడం ఏమిటని నిలదీశారు. హరికృష్ణ వద్ద రూ.40 వేలు లంచం తీసుకుని కూడా ఏఈ పనిచేయకపోవడం వల్లే ప్రశ్నిం చాడని వెల్లడించారు. ఎస్‌ఐ హనీఫ్‌పై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయని ధర్నా చేస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతానని తమ కార్యకర్తలను బెదిరించారని తెలిపారు. ధర్నా చేశామని దమ్ముంటే కేసులు పెట్టాల్సిందిగా కాకాణి సవాల్‌ విసిరారు. తప్పు చేసిన పోలీసు అధికారులపై ప్రైవేట్‌ కేసులు పెడతామని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement