సోషల్ మీడియాను సెన్సార్‌ చేస్తున్న చంద్రబాబు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams Chandrababu Government, Alleges Social Media Censorship And Law & Order Collapse In AP | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాను సెన్సార్‌ చేస్తున్న చంద్రబాబు: వైఎస్‌ జగన్‌

May 21 2026 12:39 PM | Updated on May 21 2026 1:45 PM

YS Jagan Key Comments Over CBN Govt And Social Media

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్‌ చేస్తున్నాడు. సోషల్‌ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నెన్స్‌ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోంది. చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా వెంటనే టాపిక్‌ను డైవర్ట్‌ చేస్తారు. అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. సోషల్‌ మీడియాలో అమరావతిలో అవినీతి మీద, ఇందాపూర్‌-హెరిటేజ్‌ సంబంధాలమీద, తిరుమల లడ్డూ విషయంలో, మహిళలపై వీళ్ల ఎమ్మెల్యేలు, చివరకు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి చేసిన వ్యవహారాల మీద, విచ్చలవిడిగా వీళ్లు చేస్తున్న మద్యం గంజాయి, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపైనా, ఇలా చంద్రబాబు ఇరుకునపడ్డ ఏ కంటెంట్‌ కూడా కనబడకుండా చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్‌ చేస్తున్నాడు.

సోషల్‌ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను అడ్డుపెట్టుకుని, ట్విట్టర్‌, యూట్యూబ్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టా లాంటి హెడ్‌ క్వార్టర్స్‌కు నేరుగా ఈ పోలీసులే ఆ పోస్టులను డిలీట్‌ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులను వాడుకుని అకౌంట్లను బ్లాక్‌ చేయిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్మిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంటున్నాయి.

ప్రతి ఐదు లిక్కర్ బాటిళ్లలో ఒకటి కల్తీదే. బెల్టు షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్‌ను అమ్ముతున్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు రావడమే లేదు. అయినా పోలీసులు పట్టించుకోరు. రాష్ట్రంలో గవర్నెన్స్‌ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదు. దిశ కార్యక్రమం ద్వారా మహిళలను రక్షణ కల్పించాం. గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసును పెట్టాం. కూటమి ప్రభుత్వంలో పరామర్శ కోసం మహిళలను అడ్డుకున్న తీరు అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement