సాక్షి, కోనసీమ జిల్లా: అస్వస్థతకు గురైన వైఎస్సార్సీపీ రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. గొల్లపల్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి కుమారుడు శ్రీధర్కు ధైర్యం చెప్పారు.
గొల్లపల్లి సూర్యారావు (నవంబర్ 5, బుధవారం) గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే అమలాపురం కిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. రాజోలు మండలం శివకోడులో గురువారం జరిగే రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆయన బుధవారం వెళ్లారు. పార్టీ నాయకుడు ఇంటిలో మెట్లు ఎక్కి వెళుతుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే పార్టీ నాయకులు స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
ఈసీజీలో తేడా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్.. కిమ్స్ వైద్యులతో మాట్లాడారు. కిమ్స్ గుండె వైద్యుడు అభిషేక్ వర్మ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం గొల్లపల్లి గుండెలోని క్లాట్స్ తొలగించి రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సూర్యారావు ఆరోగ్యం మెరుగ్గా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) పర్యవేక్షణలో సూర్యారావుకు వైద్యులు సేవలు అందిస్తున్నారు.


