
అన్యాయం జరిగిందని స్టేషన్కు వెళ్తే కేసు తీసుకోలేదు
బాధితురాలి కళ్ల ముందే కుమారుడు, భర్తపై చేయి చేసుకున్న సీఐ
మనస్థాపంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం
ప్రొద్దుటూరు క్రైం : ప్రజల ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కరించాల్సిన పోలీసులే ఇష్టానుసారం వ్యవహరించడమేగాక, ఫిర్యాదురాలి కుమారుడు, భర్తపై చేయిం చేసుకోవడంతో మనస్థాపంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ప్రొద్దుటూరు పోలీస్స్టేషన్ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు... స్థానిక ఈశ్వరరెడ్డి నగర్కు చెందిన సుకన్య పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తోంది. అక్కడ పనిచేసే ఏసోబుతో డబ్బు విషయమై గొడవ జరిగింది.
సుకన్యకు చదవడం, రాయడం రాకపోవడంతో ఆమె అక్క లక్ష్మమ్మ, ఆమె భర్త విజయ్బాబు, కుమారుడు మహీధర్ను తీసుకుని ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు పత్రం ఇవ్వగా తీసుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన సుకన్య స్టేషన్ ఆవరణలోనే వాస్మాల్ ద్రావణం తాగింది. ఈ దృశ్యాలు మహీధర్ ఫోన్లో చిత్రీకరించడంతో సీఐ రామకృష్ణారెడ్డి అతడిపై చేయి చేసుకున్నాడు. బాలుడు ఏడ్వడంతో సీఐ వద్దకు వెళ్లి ‘బాబు తెలియక వీడియో తీశాడు తప్పైపోయింది వదిలేయండి’ అని చెప్పిన బాలుడి తండ్రి విజయ్బాబుపై సీఐ చేయి చేసుకున్నట్లు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ రెండు ఫోన్లను పోలీసులు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తన కళ్ల ముందే కుమారుడు, భర్తను కొట్టడంతో లక్ష్మమ్మ మనస్థాపం చెంది రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వారిని కాపడారు. అయితే ఈ దృశ్యం కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇంటి వద్ద ఉన్న లక్ష్మమ్మ కుమార్తెలు చూశారు. అయితే డబ్బు విషయమై జరిగిన గొడవలో పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. విజయ్బాబు ఫిర్యాదు మేరకు ఏసోబు, ఆయన భార్య రాజమ్మ, కుమార్తె గీతికలపై కేసు నమోదు కాగా ఏసోబు ఫిర్యాదు మేరకు విజయ్బాబు, భార్య లక్షుమ్మ, అన్న కొడుకుపై కేసు నమోదు చేశామన్నారు.
ఆందోళనతో అడిగితే హేళన చేశారు
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో అందోళనగా పోలీస్ స్టేషన్కు వచ్చాం. తమ తల్దిండ్రులు రైలు పట్టాలపై పడుకున్నట్లు వీడియో వచ్చిందని ఆరా తీయగా.. వారు హేళనగా మాట్లాడి పంపారు. కంప్లైంట్ తీసుకోం.. మీరే వెళ్లి వెతుక్కోపోండి పోలీసులు అన్నారు.
– లక్ష్మమ్మ కుమార్తెలు శ్వేత, స్మాటీ, హారిక
నేను దూషించలేదు
సుకన్య వాస్మాల్ తాగిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్ల కుండా వీడియో తీస్తుంటే మహిధర్ను కొట్టినట్లు చెప్పారు. సుకన్య ఫిర్యాదును తీసుకోమని చెప్పలేదని, లక్షుమ్మను దూషించలేదని, పోలీసులను భయపెట్టేందుకు ఆమె రైలు పట్టాలపై పడుకుందని సీఐ వివరణ ఇచ్చారు.
– రామకృష్ణారెడ్డి, సీఐ