ఆస్ట్రేలియాలో ఇద్దరు విశాఖ మహిళల దుర్మరణం | Two Of Visakhapatnam Women From Same Family Died In Australia Road Accident | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఇద్దరు విశాఖ మహిళల దుర్మరణం

Sep 18 2026 5:12 AM | Updated on Sep 18 2026 5:12 AM

Two Of Visakhapatnam Women From Same Family Died In Australia Road Accident

వీడీసీఏ మాజీ జాయింట్‌ సెక్రటరీ ప్రసాద్‌ భార్య, కోడలు మృతి 

విశాఖ స్పోర్ట్స్‌: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నా­నికి చెందిన ఇద్దరు మహిళలు దుర్మరణం పాల­య్యారు. బుధవారం (సెప్టెంబర్‌ 16) రాత్రి జరి­గిన ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా క్రికెట్‌ సంఘం (వీడీసీఏ) మాజీ సంయుక్త కార్యదర్శి జి.టి.­ప్రసాద్‌ భార్య రమాదేవి (67), కోడలు నేహా బొమ్మలి (33) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో­యారు. ఈ ఘటన ప్రసాద్‌ కుటుంబంతో పాటు విశాఖ నగరంలో తీవ్ర విషాదం నింపింది. విశాఖ­లోని సీతమ్మధారలో నివాసముంటున్న జి.టి.­ప్రసాద్‌ గతంలో షిప్‌యార్డ్‌ ఉద్యోగిగా, 2017 వరకు వీడీసీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారు. 

ఆయన కుమారుడు, కోడ­లు మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు. కుమారుడి కుటుంబాన్ని చూడటంతో పాటు అక్కడ జరిగే ఒక శుభ­కా­ర్యంలో పాల్గొనేందుకు ప్రసాద్, రమాదేవి దంపతులు ఇటీవల ఆస్ట్రేలి­యా వెళ్లారు. బుధవారం రాత్రి 9:40 గంటల సమ­యంలో మెల్‌బోర్న్‌ నైరుతి శివారు పాయింట్‌ కుక్‌లోని బోర్డ్‌వాక్‌ బౌలేవార్డ్, ఇన్నిస్‌ఫైల్‌ డ్రైవ్‌ జంక్షన్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా అక్క­­డికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌కు గాయా­లయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ స్వల్పంగా గాయప­డ్డాడు. అతడిని పోలీ­సులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

పదిరోజుల్లో విశాఖకు మృతదేహాలు 
వరుణ్‌చంద్ర గున్నా, నేహా దంపతులకు మూడు­న్న­రేళ్ల కుమారుడు హారవ్, ఏడాది వయసున్న కుమార్తె వివాన్వి ఉన్నారు. ఇటీవలే వివాన్వి మొ­దటి పుట్టినరోజు వేడుకలను కుటుంబ­సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంతో వేడుకగా నిర్వహించారు. రమాదేవి, నేహా మృతదేహాలు విశాఖ చేరు­కోవడానికి కనీసం 10 రోజుల సమ­యం పట్టే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలి­పారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి­చేసి, బాధితులకు అండగా నిలిచేందుకు అక్కడి ఆస్ట్రేలియన్‌ తెలుగు కమ్యూనిటీ నిధులు సేకరిస్తోంది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా మృతి చెందడంపై వీడీసీఏ ప్రతినిధులు, విశాఖ క్రీడాకారులు తీవ్ర సంతాపం తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement