మహారాణిపేట: జీవీఎంసీ పరిధిలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ హెచ్చరించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో తాగునీటి ఇబ్బందులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని అధికార పార్టీ నేతలు చెప్పడం సరికాదన్నారు. మూడు నెలలుగా పలు వార్డుల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఎన్నికల సమయంలో హడావుడి చర్యలు కాకుండా ఏడాది పొడవునా నిరంతర తాగునీటి సరఫరాకు శాశ్వత ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రజల మౌలిక అవసరాలైన ఇళ్లు, నీరు, ఇతర సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత అన్నారు. అలాగే రైతు బజార్లలో కూరగాయల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ


