మధురవాడ: రాష్ట్రంలోని అతిపెద్ద పాఠశాలల్లో ఒకటైన చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గజలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు గురువారం బోరున విలపించారు. భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తాను సెలవు కోరుతూ వెళితే.. సెలవు ఇవ్వకపోగా, ఎగతాళి చేస్తూ ‘నీ ఉసురు తగలడం వల్లే నీ భర్త చనిపోయాడు’అంటూ ప్రధానోపాధ్యాయుడు వెంకటరావు శాపనార్థాలు పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాను తీవ్ర మనోవేదనలో ఉండి విశ్రాంతి, ఇతర కార్యక్రమాల కోసం సెలవు అడిగితే అంత దయలేకుండా మాట్లాడతారా.. అని ఆక్షేపించారు. ‘తన తప్పులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశా’వంటూ ఎత్తిపొడిచారని వాపోయారు. ఈ ఘటనతో పాఠశాలలో హెచ్ఎంకు, ఇతర ఉపాధ్యాయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సహచర ఉపాధ్యాయినులు బాధితురాలికి బాసటగా నిలిచి ఓదార్చారు. కొందరు ప్రధానోపాధ్యాయుడి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళా ఉపాధ్యాయుల పట్ల ఇలా వ్యవహరిస్తే హెచ్ఎం అని కూడా చూడకుండా తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఓ ఉపాధ్యాయుడు హెచ్చరించారు. అయితే, సదరు ఉపాధ్యాయినే తనను నిందించినట్లు హెచ్ఎం వెంకటరావు చెప్పారు.
పాలకుల ఉదాసీనతతో తరచూ వివాదాలు
ఈ పాఠశాలలో హెచ్ఎం తీరు పట్ల అత్యధిక మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేతో పాటు విద్యాశాఖ కమిషనర్ వరకు ఫిర్యాదులు చేసినా, అధికారులు నామమాత్రపు విచారణలతో సరిపెడుతున్నారన్న ఆక్షేపణలున్నాయి. ఈ వివాదాల ప్రభావం విద్యార్థుల ప్రవేశాలు, క్రమశిక్షణ, బోధన, ఉత్తీర్ణతా శాతంపై కూడా పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకుల ఈ నిర్లక్ష్య వైఖరే మరోసారి పాఠశాలలో వివాదానికి దారితీసిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్ఎం, టీచర్ మధ్య వాగ్వాదం
చంద్రంపాలెం హైస్కూల్లో విలపిస్తున్న ఉపాధ్యాయిని
చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్లో ఘటన


