దమ్ మారో దమ్.. | Traders importing marijuana from Araku on trains | Sakshi
Sakshi News home page

దమ్ మారో దమ్..

Sep 15 2025 5:57 AM | Updated on Sep 15 2025 5:57 AM

Traders importing marijuana from Araku on trains

గంజాయి మత్తులో జోగుతున్న యువత  

గంజాయి సేవించే విధానంలో కొత్త పంథా.. 

ఉడకబెట్టి గంజాయి ద్రావణాన్ని తాగుతున్న విద్యార్థులు 

అరకునుంచి రైళ్లలో దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు  

ప్రత్యేక కోడ్‌ లాంగ్వేజ్‌తో ఇన్‌స్ట్రా గ్రామ్‌లో చాటింగ్‌లు 

‘స్కోర్‌‘ అంటే గంజాయి.. ‘సెక్షన్‌’ అంటే కలుసుకునే ప్రదేశం 

గంజాయి పొగ పీల్చేందుకు పఫ్‌ స్మార్ట్‌ మెటల్‌ బ్యాంగ్‌ షూటర్‌ పైప్‌ను వినియోగిస్తున్న యువకులు 

ప్రొద్దుటూరులో శరవేగంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న గంజాయి  

ప్రొద్దుటూరు క్రైం: ‘రేయ్‌ రాజు ఎక్కడున్నావ్‌ రా.. నా దగ్గర ‘స్కోర్‌’ అయిపోయింది. నిన్ననే నువు తీసుకున్నావ్‌ అంట కదా.. అర్జంట్‌గా స్కోర్‌ తీసుకొని సెక్షన్‌కు రా.. అక్కడికి నేను వస్తున్నాను’ ఇటీవల గంజాయి కేసుల్లో పట్టుబడిన విద్యార్థుల సెల్‌ఫోన్లను పోలీసులు పరిశీలించగా ఇలాంటి సంభాషణలు కనిపించాయి. వాటిని చూసి పోలీసులు సైతం నివ్వెర పోయారు. గంజాయి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటి నుంచే అందుబాటులో ఉంది. 

అయితే నాడు వృద్ధులు, భిక్షాటన చేసే వాళ్లు సే­వించేవాళ్లు. అప్పట్లో దీన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా వ్యసన పరులు గంజాయి మొక్కలను ఇంటి పెరట్లో పెంచేవారు. అయితే ప్రస్తుతం గంజాయి రూ. లక్షలు కురిపించే వ్యాపారంగా మారింది. వైఎస్సార్‌ కడప జిల్లా్లలో వ్యాపార కేంద్రంగా పేరు గాంచిన ప్రొద్దుటూరులో గంజాయి వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది. అన్ని వ్యాపారాల మాదిరే ఇప్పు­డు గంజాయి వ్యాపారం కూడా ఇక్క­డ పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.    

విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం 
ప్రొద్దుటూరులో కొన్నేళ్ల క్రితం వరకు గంజాయి ఊసేలేదు. ప్రతి శనివారం ఇతర ప్రాంతాల నుంచి భిక్షాటన నిమిత్తం ఇక్కడికి వచ్చే కొందరు వ్యక్తుల వద్ద మాత్రమే దొరికేది. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయిని ఆదాయ వనరుగా మార్చారు. కొందరు వ్యక్తులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అరకు నుంచి ప్రొద్దుటూరుకు రైళ్లలో తెస్తున్నారు. అక్కడ 1 కిలో రూ. 5000లకు తీసుకొచ్చి ప్రొద్దుటూరులో రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. 

కిలోల లెక్కన కొనుగోలు చేసిన వ్యక్తులు పొట్లాల రూపంలో స్థానికంగా ఉన్న విద్యార్థులకు అమ్ముతున్నారు. ఒక్కో పొట్లం రూ.200, రూ.300 రూ.500లకు విక్రయిస్తున్నారు. గ్రూప్‌ ప్యాక్‌ అయితే (విద్యార్థులు పెట్టుకున్న పేరు) రూ. 1000కి విక్రయిస్తారు. ఒక్క పొట్లం గంజాయిని 5–6 మంది కలిసి సేవిస్తారు. గ్రూప్‌ ప్యాక్‌ అయితే 10 మందికి పైగా కలిసి ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కడప, గండికోట ప్రాంతాలకు కూడా గంజాయిని పంపిస్తున్నట్లు తెలుస్తోంది.    

అరకొర దాడులతో కట్టడి సాధ్యమా 
పట్టణంలో పెద్ద ఎత్తున గంజాయి వ్యాపారం సాగుతోంది. విద్యార్థులు సైతం దీని బారిన పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసుల అరకొర దాడులు, నిఘా లోపం కారణంగా గంజాయి కట్టడి కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు పోలీసులు 10 గంజాయి కేసులు నమోదు చేసి 35 మందిని అరెస్ట్‌ చేశారు. 

వారి వద్ద నుంచి 12కిలోలుపైగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ప్రొద్దుటూరు ఎక్సైజ్‌ పోలీసులు గంజాయి స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్‌ చేశారు. 13 కిలోలుపైగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు.   

గంజాయి సేవించే వారికి క్యాన్సర్‌ ముప్పు 
గంజాయి ప్రభావం శరీరంలోని అన్ని భాగాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్‌ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఆయా వ్యక్తులు ఎన్ని సార్లు గంజాయిని తీసుకుంటారనే దానిపై ఇది అ«ధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనిలోని టీహెచ్‌సీ రసాయనం శరీరంలోని అనేక కణజాలాలు, అవయవాలకు చేరుతుంది. 

టీహెచ్‌సీ మత్తును పెంచుతుందని, గంజాయిని పీల్చుకున్న వెంటనే ఇది రక్తంతో పాటు మెదడుకు చేరకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడులోని న్యూరాన్లు అదుపు తప్పుతాయని అంటున్నారు. తద్వారా నిరాశ, మానసిక సమస్య వస్తుంది. గంజాయి సేవించే వారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది.  

గంజాయి సేవించే విధానంలో కొత్త పంథా.. 
సాధారణంగా గంజాయి పొగను పీల్చుకొని ఆనందం పొందుతుంటారు. అయితే ప్రొద్దుటూరులోని యువకులు కొత్తదనంతో గంజాయిని ఆస్వాదిస్తున్నారు. గంజాయి ఎండు మొక్కలను నీళ్లలో ఉడకబెట్టి వాటి ద్రావణాన్ని తాగుతూ మత్తులోకి వెళ్తున్నారు.  కొందరు విద్యార్థులు గంజాయి పొగను పీల్చడానికి పఫ్‌ స్మార్ట్‌ మెటల్‌ బాంగ్‌ షూటర్‌ పైప్‌ను ఉపయోగిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో తెప్పించుకొని మరీ వాడుతున్నారు. ఇంకొందరు యువకులైతే ఓసీబీ పేపర్‌లో గంజాయి చుట్టుకొని సేవిస్తున్నారు. ఓసీబీ పేపర్లు కూడా స్థానికంగా ఉన్న కొన్ని దుకాణాల్లో విక్రయిస్తున్నారు.  ఇక యువకులు అధిక శాతం సిగరేట్లలో గంజాయి నింపుకొని తాగుతున్నారు.  

గంజాయినే ఎందుకు వాడుతున్నారంటే..    
‘మార్కెట్‌లో లభించే అనేక రకాల మద్యం మత్తును కలిగిస్తుంది కదా.. అవన్నీ అందుబాటులో ఉండగా గంజాయికి ఎందుకు అలవాటు పడ్డారు..’ అని గంజాయి కేసులో పట్టుబడిన యువకులను పోలీసులు ప్ర­శ్నించారు. అందుకు వారు చెప్పిన సమాధానం ఏంటంటే.. ‘ మద్యం తాగితే మహా అంటే రెండు, మూడు గంటలు మత్తులో ఉంటాం. అదీ గాక మద్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. కానీ గంజాయి పొగను ఒక సారి పీల్చితే రెండు, మూడు రోజుల పాటు అదే మత్తులో ఉంటాం.

పైగా తక్కువ ఖర్చుతో ఇది లభిస్తుంది. అందుకే దీనికి అలవాటు పడ్డాం..’అని యువకులు బదులిచ్చారు. కాగా ప్రొద్దుటూరులోని బొల్లవరం బైపాస్‌రోడ్డు, రామేశ్వరం ప్రభుత్వ పక్కా గృహాల సముదాయ ప్రాంతం, మోడంపల్లె బైపాస్‌ రోడ్డు తదతర ప్రాంతాల్లో యువకులంతా పోగై గంజాయిని సేవిస్తున్నారు. పట్టణంలోని రామేశ్వరం, జిన్నారోడ్డు, మోడంపల్లె, దస్తగిరిపేట, శ్రీనివాసనగర్, అమృతానగర్‌ తదితర  ప్రాంతాల్లో గంజాయి సేవించే యువకులు అధికంగా ఉన్నట్లు ఎక్సై­జ్‌ పోలీసు వర్గాల సమాచారం.   

ప్రత్యేక కోడ్‌ లాంగ్వేజ్‌..
ప్రొద్దుటూరులో ఇంజినీరింగ్‌ కాలేజీలతో పాటు ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇటీవల ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న పలువురిని అరెస్ట్‌ చేశా రు. ఇలా అరెస్ట్‌ అయిన నాలుగైదు  కేసుల్లోనూ ఇంటర్, డిగ్రీ, బిటెక్‌ చదువుతున్న విద్యార్థులే ఉన్నారు. పోలీసుల విచారణలో అనేక విష యా లు వెలుగు చూశాయి. విద్యార్థులు ప్రత్యేక కోడ్‌ లాంగ్వేజ్‌తో ఇన్‌స్ట్రాగ్రాంలో చాటింగ్‌ చేస్తున్నారు. గంజాయికి వీరు పెట్టుకున్న పేరు ‘స్కోర్‌’.  వీరంతా కలుసుకునే ప్రాంతాన్ని ‘సెక్షన్‌’ గా పిలుచుకుంటారు. మొబైల్‌లోని వారి ఇన్‌స్ట్రా గ్రాంలను ఎవరైనా చెక్‌ చేసినా గుర్తు పట్టకుండా ఉండేందుకు ఈ కోడ్‌ లాంగ్వేజ్‌ను ఎంచుకున్నారు.   

గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టాం
గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టాం. మాకు సమాచారం వచ్చిన వెంటనే ఆకస్మిక దాడులు చేస్తున్నాం. ఇటీవల పట్టుబడిన వారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారు. తల్లిదండ్రులు దృష్టి సారించపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. గంజాయికి బానిస అవుతున్న వారు కొత్త పద్ధతుల్లో మత్తును ఆస్వాదిస్తున్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తుంటే మాకు సమాచారం అందించండి.      – సురేంద్రారెడ్డి,  ప్రొద్దుటూరు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement