సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం (ఏప్రిల్ 1న) హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) ప్రతినిధుల చర్చలు జరిగాయి.
ప్రభుత్వ హామీని విశ్వసించలేమని ఆషా ప్రతినిధులు చెప్పారు. ప్రతిసారి చర్చల్లో నోటిమాట తప్ప ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇవ్వడం లేదని అన్నారు. జనరల్ బాడీ సమావేశంలో సైతం సమ్మె కొనసాగించాలి నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు పూర్తి స్థాయిలో విడుదల అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని ఆషా ప్రతినిధులు చెప్పారు.
బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆషా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీని బంద్ చేసింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటి కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం స్పందించలేదు.
దీంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ఆషా నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని అల్టిమేటం జారీ చేసింది. ఏపీలో గతంలోనూ ఇటువంటి హెచ్చరికలు వచ్చాయి. మళ్లీ ఇటువంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఈ స్కీమ్లో భాగస్వామ్యం కాబోమని గతంలోనూ పలు ఆసుపత్రులు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.


