ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి క‌ల్యాణోత్సవ సేవ‌ | Srivari Kalyanotsavam seva begins in Online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి క‌ల్యాణోత్సవ సేవ‌ ప్రారంభం

Aug 7 2020 5:27 PM | Updated on Aug 7 2020 6:20 PM

Srivari Kalyanotsavam seva begins in Online - Sakshi

సాక్షి, తిరుమల : తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శుక్ర‌వారం ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రారంభించింది. మొద‌టిరోజు 118 మంది గృహ‌స్తులు(ఇద్ద‌రు) ఆన్‌లైన్‌ టికెట్లు బుక్ చేసుకుని ఈ సేవ‌లో పాల్గొన్నారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌తిరోజూ ఏకాంతంగా క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తున్నారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ విధానంలో ఈ సేవ‌ను ప్రారంభించారు.

ఆగ‌స్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వ‌ర‌కు ఉన్న క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రూ.1000  చెల్లించి ఆన్‌లైన్‌లో ర‌శీదు తీసుకున్నవారు ఆన్‌లైన్‌ ద్వారానే క‌ల్యాణోత్స‌వంలో పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. టిక్కెట్లు కలిగి విధిగా సంప్రదాయ దుస్తులు ధరించి ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను అర్చకులు స్వామివారికి నివేదించారు. ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు, క‌ల‌కండ‌ ప్ర‌సాదాన్ని పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాకు పంపించే ఏర్పాట్లను టీటీడీ చేసింది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా గృహ‌స్తులు త‌మ ఇళ్ల నుండి క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement