
సాక్షి, హైదరాబాద్: గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బోగీలో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ ప్రయాణికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. సంత్రగాచి-సికింద్రాబాద్ రైలు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరింది. ఈ రైలు గుంటూరుకు చేరుకున్న తర్వాత..లొక బోగీలో ఒక మహిళా ప్రయాణికురాలు మాత్రమే కూర్చుని ఉంది. ఇంతలో ట్రైన్ కదిలే సమయంలో ఓ వ్యక్తి(40) ఆమె ఉన్న బోగీలో ఎక్కాడు. రైలు కొంత దూరం వెళ్లాక.. బోగీలో ఎవరూ లేకపోవడంతో సదరు వ్యక్తి.. మహిళను బెదిరింపులకు గురిచేశారు. కత్తితో బెదిరించి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె.. హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని మరో స్టేషన్లో దిగి పారిపోయాడు. ఈ ఘటన గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతరం, రైలు చర్లపల్లికి చేరుకోగానే బాధితురాలు.. రైల్వే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ ఘటనపై ప్రయాణికులు స్పందిస్తూ.. రైలు ప్రయాణాల్లో మహిళల భద్రత విషయమై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
