బాబు సర్కారు కుట్ర.. ఆర్టీసీని ప్రైవేట్‌కు ఇచ్చేద్దాం! | RTC Privatization, Chandrababu Govt Preparing To Hand Over RTC Operations To Private Firms, Debate Over 750 E-Buses | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు కుట్ర.. ఆర్టీసీని ప్రైవేట్‌కు ఇచ్చేద్దాం!

May 29 2026 5:41 AM | Updated on May 29 2026 5:57 PM

RTC privatization: Chandrababu Naidu government conspiracy

కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు

సాక్షి, అమరావతి: రాష్ట రోడ్డు రవాణా సంస్థను చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ప్రైవేట్‌కు ధారా­దత్తం చేయడానికి పూనుకుంది. రూ.500 కోట్లు కేటాయిస్తే.. 750 ఇ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించవచ్చు. నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది కూడా. ఫలితంగా ఆర్టీసీ దర్జాగా మనుగడ సాగిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో ఈ మేరకు రాజ ముద్ర వేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో 750 బస్సులతో మొదలుపెట్టి.. దశల వారీగా మొత్తం 8 వేల బస్సులను ప్రైవేటుపరం చేసే కుతంత్రానికి పదును పెడుతోంది. 52 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని మొత్తంగా అమ్మేయడానికి కార్యాచరణను వేగవంతం చేసింది. 

ఇ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీకి తిలోదకాలు ఇచ్చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించేసింది. అందుకు తొలి దశలో 750 ఇ–బస్సులతో ప్రై‘వేటు’ కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ప్రధాన మంత్రి ఇ–బస్‌ సేవా పథకం కింద దేశంలో 10 వేల ఇ–బస్సులను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఏపీకి 1,050 బస్సులు కేటాయించారు. 750 సాధారణ బస్సులు కాగా, మరో 300 బస్సులు తిరుపతి – తిరుమల మధ్య ఘాట్‌ రోడ్డు సర్వీసుల కోసం నిర్వహిస్తారు. ఈ ఘాట్‌ రోడ్డు బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించిన 750 బస్సులను ఆర్టీసీనే సొంతంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  

నిర్వహణ సాధ్యం కాదంటూ .. 
750 ఇ– బస్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సింది కేవలం రూ.500 కోట్లు మాత్రమే. ఆ బస్సుల చార్జింగ్‌ సదుపాయాల కోసం ఆర్టీసీ డిపోల్లో హైటెన్షన్‌ కనెక్టివిటీ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.89 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.80 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తుంది. కాబట్టి ఆర్టీసీ కేవలం రూ.9 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది. దాంతో 750 ఇ–­బస్సులను ఆర్టీసీనే సొంతంగా నిర్వహించొచ్చు. ఫలితంగా ఆర్టీసీ మనుగడకు ఎటువంటి ఇబ్బందీ రాదు. ఈ విషయా­న్ని పూర్తి గణాంకాలతో సహా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రవాణా శాఖ ఉన్నతాధికారులకు వివరించాయి. నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ 750 ఇ–­బస్సులను సొంతంగా నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభు­త్వ పెద్దలు తిరస్కరించారు. అందుకోసం రూ.500 కోట్లు కేటాయించేది లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే ఆ 750 బ­స్సులు ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహణకు టెండర్లు పిల­వాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. సీఎం చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో అందుకు ఆమోద ముద్ర వేయనున్నారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.  

దశల వారీగా ఆర్టీసీపై ప్రై‘వేటే’ 
ఆర్టీసీ ప్రైవేటీకరణ కేవలం 750 ఇ–బస్సులకే పరిమితం కాదు. మొత్తం బస్సులను దశల వారీగా ప్రైవేటుపరం చేసే­ందుకే ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తు­తం 11 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో 8 వేలు ఆర్టీసీ సొంత బస్సులు కాగా, 3 వేల బస్సులను అద్దె విధానంలో నిర్వహిస్తున్నారు. అద్దె ఒప్పంద కాల పరిమితి ముగియగానే ఆ 3 వేల బస్సులను తొలగిస్తారు. ఇక ఆర్టీసీకి చెందిన 8 వేల బస్సుల స్థానంలో  ప్రైవేటు సంస్థల ద్వారా దశల వారీగా ఇ–బస్సులను ప్రవేశ పెడతారు. ఆర్టీసీ కొత్త­గా ఒక్క బస్సు­ను కూడా కొనుగోలు చేయదు. సగటున రోజుకో బస్సును తొలగిస్తోంది. అంటే కొద్ది కాలంలోనే రాష్ట్ర రోడ్లపై ఆర్టీసీ బస్సు అన్నది కనిపించదు. అన్ని బ­స్సు­లను ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. బస్సులు ఉండకపోతే ఇక ఉద్యోగ ని­యామకాలు అవసరం లేదు. అందుకే ఆర్టీసీలో 8 వేల ఖాళీ పోస్టులు ఉన్నా సరే జాబ్‌ క్యా­లండర్‌లో వాటి గురించి ప్రభు­త్వం ప్రస్తావించనే లేదు. ఇక­పై రిటైరయ్యే ఉద్యోగుల పోస్టులను కూడా భర్తీ చే­యరు. బస్సులు లేకపోతే ఇక ఆర్టీసీకి ఆస్తులతో పనేముందని ప్రభుత్వ పెద్దలు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతుండటం గమనార్హం. ఇప్పటికే రూ.6 వేల కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కేటాయించారు. అదే రీతిలో రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు, బస్‌ స్టేషన్లను కూడా ప్రైవేటు సంస్థల పరం చేసేందుకు ఎంతో కాలం పట్టదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement