టెన్త్‌ పరీక్షలపై విద్యా శాఖ కీలక నిర్ణయం | Only 7 papers in Tenth‌ exams | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షల్లో 7 పేపర్లే

Jan 28 2021 3:41 AM | Updated on Jan 28 2021 5:20 AM

Only 7 papers in Tenth‌ exams - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను 7 పేపర్లకు పరిమితం చేయనున్నారు. కోవిడ్‌ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, స్కూళ్లలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ 5 నెలలు ఆలస్యంగా నవంబర్‌ 2 నుంచి ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్‌ పరీక్షలను జూన్‌ 17వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. 

సైన్స్‌లో రెండు పేపర్లు 
కరోనా కారణంగా గత ఏడాదిలో విద్యాశాఖ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించింది. ఆ మేరకు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించినా కరోనా తీవ్రత కారణంగా రద్దు చేసి విద్యార్థులందరినీ ఆల్‌పాస్‌గా ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తరగతులు ఆలస్యం కావడంతో సిలబస్‌ కుదించి బోధన చేయిస్తున్నారు. దీంతో పాటు బోధనాభ్యసన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరగనందున గత ఏడాది మాదిరిగానే ఈ సారి పేపర్ల సంఖ్యను 7కు కుదించారు. గత ఏడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్టు పేపర్లను కలిపి 6కు కుదించారు. ఈసారి భాషా పేపర్లు, సైన్స్‌ మినహా ఇతర సబ్జెక్టు పేపర్లను ఒక్కొక్కటి చొప్పున 5 ఉంటాయి. సైన్స్‌లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శా్రస్తాలకు సంబంధించి వేర్వేరు పేపర్లుగా ఉంటాయి. మొత్తం 7 పేపర్లలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.  
 
నేరుగా 100 మార్కులకే పరీక్ష 
నిరంతర సమగ్ర విద్యా మూల్యాంకనం (సీసీఈ) ప్రకారం టెన్త్‌లో గతంలో ఆయా పేపర్లలో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించే వారు. 20 మార్కులను అంతర్గత పరీక్షల మార్కుల నుంచి కలిపేవారు. అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం వాటిని రద్దు చేసి టెన్త్‌లో అన్ని పేపర్లను 100 మార్కులకు నిర్వహిస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో కూడా అదే విధానంలో ఒక్కో పేపర్‌ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. 

వేసవి సెలవులు లేవు 
విద్యా సంవత్సరం, తరగతులు ఆలస్యంగా ఆరంభించడం వల్ల టెన్త్‌ విద్యార్థులకు సిలబస్‌ బోధన పూర్తి చేయడానికి పని దినాలు సర్దుబాటు కావాల్సి ఉంది. ఈ దృష్ట్యా టెన్త్‌ విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా తరగతులను కొనసాగించనున్నారు. సిలబస్‌ పూర్తి, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధులను చేయడానికి 160 పనిదినాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెండో శనివారాలు, ఆదివారాలు మినహా తక్కిన అన్ని రోజులను పని దినాలుగా చేయనున్నారు. 

తరగతులు ఇక ‘ఫుల్‌ డే’ 
ప్రస్తుతం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు (హాఫ్‌ డే) నిర్వహిస్తున్న పాఠశాలలను బుధవారం నుంచి సాయంత్రం 4.30 వరకు (ఫుల్‌ డే) నిర్వహించేలా విద్యాశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచి్చంది. 6 నుంచి 10 తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement