
సాక్షి,గుంటూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్.హెచ్.ఆర్.సీ. సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్,డీజీపీని ఆదేశించించింది.
తన భర్త చేసిన అప్పులు తీర్చలేదని నారాయణపురంలో మహిళను టీడీపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. ఈ అమానవీయ ఘటనను సాక్షిటీవీ వెలుగులోకి తెచ్చింది. నేషనల్ మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
A video from #Kuppam surfaced where a woman was tied to tree after her husband failed to repay loan of 80,000. Police had registered a case & accused taken in custody.#AndhraPradesh CM @ncbn orders strict action against those who attacked the woman. pic.twitter.com/D3nID4char
— Aneri Shah Yakkati (@tweet_aneri) June 17, 2025
‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను’
‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే.
మేం బాగా బతికినోళ్లమే
‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది.
నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు
‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు.
వికలాంగ పెన్షన్ను కాజేశారు
మా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించారు.