మటం మరిస్వామికి గుబ్బి వీరణ్ణ పురస్కారం

Matam Mariswamy Get Dr Gubbi Veeranna Award - Sakshi

సాక్షి, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిర గ్రామానికి చెందిన హార్మోనియం విద్వాంసుడు, సంగీత సామ్రాట్‌ బిరుదాంకితుడు మటం మరిస్వామిని మరో విశిష్ట పురస్కారం వరించింది. కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారాలలో ఒకటైన గుబ్బి వీరణ్ణ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చేతుల మీదుగా మరిస్వామి అవార్డుతోపాటు రూ.5లక్షల నగుదును అందుకున్నారు. ఆయన తన స్వగ్రామం మదిరకు గురువారం చేరుకున్నారు.

కళాకారులు, బంధుమిత్రులు పెద్దఎత్తున ఆయన్ను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో స్వర మాంత్రికుడిగా ఖ్యాతి గడించిన పండిట్‌ పుట్టరాజ గవాయి ప్రియశిష్యుల్లో మరిస్వామి ఒకరు. తన 13వ ఏట నుంచే గవాయి నాటక కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన వందలాది నాటక ప్రదర్శనలకు ఆయన ఆరేళ్లపాటు అద్భుతమైన సంగీతం సమకూర్చి పుట్టరాజ గవాయిచే ప్రశంసలు అందుకున్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top