తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం డిసెంబర్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (ఎస్ఈడీ) కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు దేశ వ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.


