మహారాణిపేట (విశాఖ): ఐదు సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన ముగ్గురు మత్స్యకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో బయట పడ్డారని ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ తెలిపారు. మంగళవారం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఏపీ మరపడవల సంఘం కార్యాలయంలో విశాఖ చేరుకున్న మత్స్యకారులు పి.నారాయణరావు(ఐ.పోలవరం,పసుపులంకగ్రామం), మైలపల్లి భాస్కరరావు (ఎచ్చెర్ల, కొయ్యాం గ్రామం), మాదే అన్నవరం (గజ్జికాయలపురం,కాట్రేకు కోన)తో కలిసి జానకీరామ్ విలేకరులతో మాట్లాడారు.
పాకిస్తాన్ బాధిత మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వీరికి అయిదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేíÙయా, మత్స్యకార భరోసా ఇవ్వాలని కోరారు. బతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ముగ్గురు మత్స్యకారులు గుజరాత్ వీరావల్ ప్రాంతానికి వలస వెళ్లి చేపల వేట చేస్తూ 2018 నవంబర్లో పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి చిక్కుకున్నారని ఏపీ సీఎం చొరవతో ఇప్పుడు బయట పడ్డారని వివరించారు. బుధవారం మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వీరిని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని జానకీరామ్ తెలిపారు.