
పురుగు మందు తాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి
కమ్మోడివి.. నీకు ఆ పార్టీతో ఏంటని డీఎస్పీ దూషణ
కేవలం వైఎస్సార్సీపీ వాడినని టార్చర్ పెట్టారు
లేని నేరాన్ని మోపి రూ.35 లక్షలు కట్టాలంటున్నారు
పురుగు మందు తాగి వ్యాపారి లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్
తన పాడె మోయాలంటూ వైఎస్ జగన్కు విన్నపం
సాక్షి, టాస్క్ ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియో (వాంగ్మూలం) లోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు.
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్వీఆర్ అలియాస్ గాం«దీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామగ్రిని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకును పంపుతున్నాడు. ఈ క్రమంలో తన భాగస్వామి గాంధీ అలియాస్ ఎమ్వీఆర్ మృతి చెందడంతో ఎవరికి రావాల్సిన వాటాలు వారు తీసేసుకున్నారు.
లక్ష్మీనారాయణ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాంధీ కింద పని చేస్తున్న హనుమంతు, వెంకటేష్, రెడ్డి, సునీల్ వచ్చి తాము కూడా వ్యాపారం చేసుకుంటామని, సరుకు ఇప్పించమని కోరారు. దీంతో లక్ష్మీనారాయణ వారికి కావాల్సిన సరుకు ఇవ్వమని వైఎన్ఆర్కు మాట సాయం చేశాడు. అప్పులకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వీరి నుంచి నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మొత్తంగా రూ.35 లక్షలు ఇవ్వాలంటూ వైఎన్ఆర్ ఏడాదిన్నర నుంచి లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు.
టీడీపీ రాకతో వేధింపులు
సార్వత్రిక ఎన్నికల సమయంలో గుత్తా లక్ష్మీనారాయణ మరో నలుగురు కలిసి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించటంతో వైఎన్ఆర్ రాజుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజుపాలెం ఎస్ఐ మూడు నెలల క్రితం పిలిచి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు. పగబట్టిన వైఎన్ఆర్ ఎలా అయినా సరే లక్ష్మీనారాయణను వేధించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పిడుగురాళ్లకు చెందిన తెలుగుదేశం నాయకులు ఖలీల్ రామారావు, పట్టిపాటి రామారావు, వంశీలను ఆశ్రయించారు.
ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులకు పోలీసులతో ఉన్న పరిచయాలతో లక్ష్మీనారాయణను రోజూ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. తాను వైఎన్ఆర్కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పోలీసులతో తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు పంచాయతీని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వద్దకు తీసుకువచ్చారు.
నువ్వు కమ్మోడివి కాదా.. రెడ్లకు పుట్టావా?
సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి నాలుగు రోజుల క్రితం లక్ష్మీనారాయణకు పిలుపొచ్చింది. అక్కడికి వెళ్లగానే.. ‘నువ్వు కమ్మోడివి. నీకు ఆ పార్టీ (వైఎస్సార్సీపీ)తో పని ఏంటి? రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా? రాజకీయాలు చేయాలంటే నీకు ఇక పార్టీలే లేవా? నువ్వు కమ్మోడివేనా.. నువ్వేమైనా రెడ్లకు పుట్టావా?’ అంటూ పోలీసులు నోటికి వచ్చినట్లు దూషించారు. ‘మర్యాదగా టీడీపీ నేతలు ఇవ్వాలంటున్న రూ.35 లక్షలు చెల్లిస్తే ఓకే. లేదంటే నా సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా’ అంటూ డీఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశాడు.
డీఎస్పీ టార్చర్ పెట్టడాన్ని భరించలేక మనస్థాపం చెందిన లక్ష్మీనారాయణ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ‘జగనన్నా.. నేను బతికుంటానో లేదో తెలియదు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు. దయచేసి మీరు నా శవాన్ని తాకి పాడె మోయాలి. నా కుటుంబాన్ని పరామర్శించాలి.

అప్పుడైనా ఈ అరాచకాలకు చెక్ పడుతుందేమో. మళ్లీ నాలాంటోడు ఇంకొకడు బలి కాకుండా, నాలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమో. నా చావుకు నేను రాజకీయం పులమడం లేదు. చచి్చపోతూ అబద్ధం ఆడనన్నా. కేవలం వైఎస్సార్సీపీ అని వేధిస్తున్నారన్నా’ అని వాపోయారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. లక్ష్మీనారాయణను బంధువులు గుంటూరుకు తరలించగా వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
రెడ్బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్త
డీఎస్పీ సహా బాధ్యులపై చర్య తీసుకోవాలి
సీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకు బాధ్యులైన డీఎస్పీతో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో, లేఖతో సహా శుక్రవారం ఎక్స్లో పోస్టు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. ఆయనపై గతంలో వ్యాపార భాగస్వామి చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచి పెట్టారు.
కానీ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు.. అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున (శుక్రవారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు.
బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.