వైఎస్సార్ కడప జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం భూ పందేరం
భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయలు..
స్వల్ప లీజు రుసుముతో దీర్ఘకాలం అప్పగింత
కార్పొరేట్లకు 283 ఎకరాల కేటాయింపు
సాక్షి, అమరావతి: గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతో వైఎస్సార్ కడప జిల్లాలోని వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకుగానూ కూటమి ప్రభుత్వం గురువారం ఒక్కరోజే నాలుగు జీవోలను జారీ చేసింది. ఈ జిల్లాలో మొత్తం 283.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్ సంస్థలకు 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. బి.మఠం మండలంలోని పలుగురాళ్లపల్లి, పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో 176.33 ఎకరాలు, పలుగురాళ్లపల్లిలో మరో 9.25 ఎకరాలు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కేటాయించింది.
అలాగే, తొండూరు మండలంలోని మల్లెల, తొండూరు, బుచ్చుపల్లి గ్రామాల్లో 70.04 ఎకరాలు అంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు 126 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించింది. ముద్దనూరు మండలం కొలవలి గ్రామంలో మరో 27.77 ఎకరాలు అంప్లస్ ఎవరెస్ట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. ఈ నాలుగు చోట్లా ఎకరాకు ఏడాదికి లీజు రుసుంను కేవలం రూ.31 వేలుగా నిర్ణయించింది. ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంపు ఉంటుందని పేర్కొంది.
గరిష్టంగా 30 ఏళ్లపాటు ఈ భూములు ఆయా కంపెనీల ఆ«దీనంలో ఉండనున్నాయి. భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయల్లో ఉండగా, స్వల్ప లీజు రుసుముతో దీర్ఘకాలికంగా అప్పగించడం గమనార్హం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయి? ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


