ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక | Lightning Warning For Rayalaseema Districts | Sakshi
Sakshi News home page

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

May 30 2026 4:50 PM | Updated on May 30 2026 4:54 PM

Lightning Warning For Rayalaseema Districts

సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జూన్‌లోనూ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంచనా వేసింది. ఏపీతోపాటు యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా జూన్‌ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని.. ఇది ఏప్రిల్‌లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువని తాజా అంచనాలో పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటంతో మధ్యభారత్‌ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, దేశ వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement