సాక్షి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పిడుగులతో కూడిన కుండపోత వర్షం కురవొచ్చని హెచ్చరించింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద కదులుతోంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే మూడు గంటల్లో ఎప్పుడైనా వర్షం మొదలుకావొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచనలు జారీ చేసింది.
వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో స్థానిక యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. విద్యుత్ అంతరాయాలు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రత్యేకంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు తదితర ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


