
ఈరోజూ, రేపు అధికంగా వానలు
రాయలసీమపై అధిక ప్రబావం
సాక్షి, అమరావతి: వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకు, ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్, మధ్య ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా 11, 12 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతోపాటు ఎండ ప్రభావం ఉంటుందని తెలిపింది.
మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.2, విశాఖ జిల్లా ఆనందపురంలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా వేమవరంలో 40 డిగ్రీలు, కొనకనమిట్లలో 39.9, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
