227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
మార్కాపురం జిల్లా కంభంలో గరిష్టంగా 45.7 డిగ్రీలు నమోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1, అమరావతిలో 44.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8, తిరుపతి జిల్లా బేస్తపల్లి, వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లిలో 44.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.


