సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పిడుగులాంటి వార్త చెప్పింది. విద్యా కానుక కింద విద్యార్థులకందించే యూనిఫాం, షూ, బ్యాగ్ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ మేరకు జూన్ 12 వ తేదీన అందించే విద్యాకానుక కిట్ను అందించలేమని సమగ్రశిక్ష డైరెక్టర్ ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలోనూ గ్యారంటీ లేదని ప్రకటించారు.
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక భారంతో యూనిఫాం, బ్యాగు, బట్టలు ఇవ్వలేమని తెలిపింది. ఈ పిడుగులాంటి వార్తతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాయాంలో పాఠశాలలు తెరిచే రోజే విద్యా కానుక కిట్ను అందజేసేవారని ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేసి తమ చదువులకు ఆటంకం కలగజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతుంది. గత రెండేళ్లుగా నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన విద్యార్థుల చదువు విషయంలోనూ కూటమి ప్రభుత్వం కోతలు పెడుతుండడంతో సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.


