ఎటువంటి ‘చార్జీ’లు లేకుండానే పింఛన్‌ ఇవ్వండి | Sakshi
Sakshi News home page

Published Fri, May 3 2024 5:35 AM

Give pension without any charges: Andhra Pradesh

బ్యాంక్‌లకు ఎస్‌ఎల్‌బీసీ ఆదేశం  

74,399 మందికి ఇంటి వద్దకే పింఛన్లు  

సాక్షి,అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలతో అవ్వాతాతల పింఛన్‌ సొమ్మును వారి బ్యాంక్‌ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పింఛన్‌ సొమ్మును ఎలాంటి చార్జీలకు మినహాయించుకోకుండా ఇవ్వాలని బ్యాంక్‌లను రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) ఆదేశించినట్లు సెర్ప్‌ అధికారులు గురువారం తెలిపారు. అవ్వాతాతలు తమ బ్యాంక్‌ అకౌంట్‌లను చాలా కాలంగా ఉపయోగించని కారణంగా ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్‌ లేదు.

దీంతో ఆయా అకౌంట్లకు బ్యాంక్‌లు చార్జీలు విధిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..అవ్వతాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారు పింఛన్‌ డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఎటువంటి చార్జీలను బ్యాంక్‌లు తీసుకోకుండా చర్యలు తీసుకుంది. కాగా, మొత్తం లబి్ధదారులు 65.94 లక్షల మందిలో 48.92 లక్షల మందికి వారి బ్యాంక్‌ ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, వారందరి బ్యాంక్‌ ఖాతాల్లో బుధవారమే అధికారులు డబ్బులు జమ చేయగా, అందులో 74,399 మందికి వారి సాంకేతిక కారణాలు కారణంగా సొమ్ము జమ కాలేదు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్‌ అందేలా వారి ఇళ్ల వద్దనే పింఛన్‌ పంపిణీకి చర్యలు తీసుకుంటామని సెర్ప్‌ అధికారులు తెలిపారు. కాగా, మే నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది లబి్ధదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.1,945.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా గురువారం సాయంత్రం వరకు డీబీటీ విధానంలో 48.92 లక్షల మంది లబి్ధదారులలో 48.17 లక్షల మందికి వారి బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.

 దివ్యాంగులు, మంచం/వీల్‌చైర్‌కు పరిమితమైన వారిలో 16.57 లక్షల మందికి వారి ఇంటి వద్దనే పింఛన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందులో 15.13 లక్షల మందికి గురువారం నాటికి పంపిణీ పూర్తయినట్లు వివరించింది. డీబీటీ విధానంలో 98.47% మందికి, లబి్ధదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేవారిలో 91.34% మందికి పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement