శోభాయాత్రలో కళాకారుల ప్రదర్శన
శోభాయాత్రతో సరికొత్త వైభవం
మంత్రముగ్ధుల్ని చేసిన సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వీణ, నాదస్వర ప్రదర్శనలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్ రైడ్
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: వైఎస్సార్ కడప జిల్లాలో పర్యాటక ప్రాంతమైన గండికోటలో వారసత్వ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వీణ, నాదస్వర ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. హస్తకళల ప్రదర్శన, స్థానిక వంటకాల స్టాళ్లు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. హెలికాప్టర్ రైడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను రాయలసీమ సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలను ప్రపంచానికి చాటిచెప్పేలా డిజైన్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు లైవ్ కాన్సర్ట్లు (రామ్ మిరియాల, డ్రమ్స్ శివమణి వంటి ప్రముఖుల ప్రదర్శనలు), డ్రోన్ షో, ఫైర్ క్రాకర్స్, హెలికాప్టర్ రైడ్స్, పారాగ్లైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీలు ఉన్నాయి. లేజర్ షో, ముషాయిరా తదితర కార్యక్రమాలు ఆకట్టుకోగా.. మంగ్లీ పాట కచేరీ ఉర్రూతలూగించింది. తొలుత సాహితీవేత్తలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తవ్వా ఓబులరెడ్డి, సగిలి సుధారాణి గండికోట చరిత్రను వివరించారు. శోభాయాత్రలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.


