
సాక్షి, అమరావతి: ఇళ్ల పట్టాల కేసులో మాజీమంత్రి పేర్ని నానికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని వివరణ తీసుకోకుండా ఎలాంటి కేసు నమోదు చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.
ఇళ్ల పట్టాల అంశంలో తనపై ఆరోపణలు రావడంపై ఆయన హైకోర్టులో ముందస్తు పిటిషన్ వేశారు. అయితే ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు ఇవాళ కోర్టుకు వివరించారు. ఈ తరుణంలో.. ఒకవేళ భవిష్యత్లో ఈ అంశంపై కేసు కడితే పేర్ని నాని వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పేర్ని నాని వాదన పూర్తిగా విన్న తర్వాతే ప్రభుత్వం విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో తనపై చర్యలు తీసుకోకుండా జూన్ 11, 2025న పిటిషన్ దాఖలు చేశారు. మచిలీపట్నంలో అర్హులకే పట్టాలు ఇచ్చారని, తనకు, తన కుమారుడు పేర్ని కిట్టూకి ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు.