పోస్టింగ్‌ ఇస్తామన్నా ‘వద్దు సార్‌’ అంటున్న అధికారులు | dharmavaram faces officer shortage amid political pressure | Sakshi
Sakshi News home page

పోస్టింగ్‌ ఇస్తామన్నా ‘వద్దు సార్‌’ అంటున్న అధికారులు

Jun 1 2026 1:03 PM | Updated on Jun 1 2026 1:07 PM

dharmavaram faces officer shortage amid political pressure

ధర్మవరంలో పోస్టింగ్‌ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం చూపేవారు. సిఫార్సు లేఖల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కూటమి’ నాయకుల ఒంటెత్తు పోకడలు, ఒత్తిళ్ల గురించి తెలుసుకుని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారులు తమ వద్దకు పిలిచి మరీ పోస్టింగ్‌ ఇస్తామన్నా ‘మాకొద్దు సార్‌’ అంటూ చేతులెత్తేస్తున్నారు. కాదని బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  

ధర్మవరం: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో  వింత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా 5 నెలలుగా ఇక్కడ ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ, ఇన్‌చార్జ్‌ డీఎస్పీతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత సమస్మాత్మక   ప్రాంతాల్లో ధర్మవరం ఒకటి. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఇక్కడి పోలీస్‌ సబ్‌ డివిజన్‌కు 5 నెలలుగా రెగ్యులర్‌ డీఎస్పీ లేకపోవడం గమనార్హం. పెనుకొండ డీఎస్పీ    నర్సింగప్పను ఇన్‌చార్జ్‌గా నియమించినా, రెండు సబ్‌ డివిజన్‌లను పర్యవేక్షించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ సక్రమంగా లేక అంతా ఇష్టారాజ్యంగా మారింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇటీవల వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు, పట్టపగలే రైతు కిడ్నాప్, సచివాలయంలో చోరీ ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనం. 

అవస్థల పర్వం.. 
ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లో సైతం పాలన అటకెక్కింది.తాడిమర్రిలో రెండేళ్లుగా, ధర్మవరంలో ఏడాదిగా తహసీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో   రెండేళ్లుగా ఆర్‌ఐలు కూడా లేరు. ఇక.. నియోజకవర్గానికి రెగ్యులర్‌ ఆర్డీఓను నియమించకుండా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఆమె ఎప్పుడో ఒకసారి ధర్మవరం వచ్చి వెళ్తుండటంతో రెవెన్యూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. భూముల రీ సర్వేలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్లు స్పందించకపోతే చెప్పుకునేందుకు ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పని కోసం కూడా ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. 

అంతులేని అవినీతి.. 
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో  కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్‌ చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకున్నట్లు తెలుస్తోంది.   

కూటమి నాయకుల ఒత్తిళ్లతోనే.. 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటంటే తమ మాటే జరగాలంటూ ‘కూటమి’ పారీ్టలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్‌చార్జ్‌లు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మంత్రి సత్యకుమార్‌ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్‌చార్జ్‌ చిలకం మధుసూధన్‌రెడ్డి సైతం పెత్తనం కోసం ప్రయతి్నస్తుండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు.  

ఇబ్బందులు పడుతున్నాం 
ఉన్నతాధికారులు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆర్‌ఐలు అందుబాటులో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. వారాల తిరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.  
–గుండా ఈశ్వరయ్య, ధర్మవరంవాసి

ప్రజల్లో భయాందోళన 
ఏటీఎంలలో చోరీలు, రైతు కిడ్నాప్, సచివాలయంలో విధ్వంసం వంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిజాయితీ గల అధికారులను నియమించకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. –చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ విభాగం   

Advertisement
 
Advertisement
Advertisement