వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
తుని: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల పాలన సూపర్హిట్ కాదని, అట్టర్ఫ్లాప్ అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చెప్పారు. చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలు, అసత్యాలు అని ప్రజలు తెలుసుకున్నారన్నారు. అందుకే కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం నిర్వహించిన సభలో నుంచి మహిళలు మధ్యలోనే వెళ్లిపోయారని చెప్పారు. రాజా సోమవారం తుని మండలం ఎస్.అన్నవరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. విధ్వంసం తప్ప అభివృద్ధి లేని చంద్రబాబు రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. సభలో చంద్రబాబు మాట్లాడిన 10 నిమిషాల్లోనే మహిళలు బయటకు వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు.
ప్రజల కోసం ఏం చేశారో చెప్పుకొనే అవకాశం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా ఆరులక్షల మందికి పింఛన్లు తొలగించారని చెప్పారు. ఆడబిడ్డ నిధి, రైతుభరోసా తదితర పథకాలను ఇవ్వలేదన్నారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. మంచి చేయకపోగా గత ప్రభుత్వంపై బురద చల్లడాన్ని ప్రజలు గమనించారన్నారు. వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయమని, అందుకే పదేపదే గొడ్డలి పార్టీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.


