జీవితాలే బెట్‌.. మాఫియా క్రికెట్‌ | Cricket betting mafia is rampant in country | Sakshi
Sakshi News home page

జీవితాలే బెట్‌.. మాఫియా క్రికెట్‌

Apr 10 2025 6:05 AM | Updated on Apr 10 2025 12:59 PM

Cricket betting mafia is rampant in country

దేశంలో బరితెగిస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా

ఐపీఎల్‌ సీజన్‌లోనే రూ.10 వేల కోట్ల దందా 

బెట్టింగ్‌లో 34 కోట్ల మందికి పైగా భారతీయులు 

బ్యాంకు ఖాతాలు ఖాళీ.. కరిగిపోతున్న ఆస్తులు 

అప్పుల భయంతో ఏటా 500 మంది ఆత్మహత్య 

ఏపీలోనూ నగరాల నుంచి పల్లెలకు పాకిన జాడ్యం 

కూటమి నేతలే రింగ్‌ మాస్టర్లుగా బెట్టింగ్‌ దందా 

చోద్యం చూస్తున్న పోలీసు శాఖ 

సరైన చట్టాలు లేక చెలరేగిపోతున్న మాఫియా

ఫోర్‌ కొడితే చప్పట్లు.. సిక్స్‌ కొడితే కేకలు.. వికెట్‌ పడితే అరుపులు.. గెలుపు ఓటములపై ఉత్కంఠ..! ఇవీ సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లో ఆస్వాదించే అంశాలు.. అయితే, ఇదంతా తెర ముందు దృశ్యం..! 

మరి తెరవెనుకో..? 
టాస్‌కు ముందు.. పరుగు తీస్తే.. ఫోర్‌ కొడితే.. సిక్స్‌ బాదితే.. మ్యాచ్‌లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ బెట్టింగ్‌..! బెట్టింగ్‌..! అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. చివరికి ఏ టీమ్‌ మ్యాచ్‌ గెలిచినా ఓడేది మాత్రం కచి్చతంగా పందెం కాసినవారే. అది ఎంతగా అంటే..? బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.. అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్‌ తోనే జీవితం తలకిందులైపోతోంది.  

సాక్షి, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐపీఎల్‌ (IPL) సందడితో పాటు.. దేశంలో క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా ఇన్నింగ్స్‌ కూడా మొదలవుతోంది. ఆట పట్ల సగటు భారతీయుడి వ్యామోహమే పెట్టుబడిగా ఊబిలోకి లాగుతోంది. చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దిగజారుస్తోంది. డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ తాజా నివేదిక ప్రకారం ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లోనే దేశంలో వంద బిలియన్‌ డాలర్ల  (రూ.8,500 కోట్లు పైగా) బెట్టింగ్‌ దందా సాగుతోంది. 

గత 17 సీజన్లను విశ్లేషించి ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఏటా బెట్టింగ్‌ దందా 30 శాతం చొప్పున పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుత 18వ సీజన్‌లో బెట్టింగ్‌ అత్యంత గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసింది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఖాయమని స్పష్టం చేసింది. ఏటా ఐపీఎల్‌ సీజన్‌లో 34 కోట్లమంది బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని ఇండియా ఛేంజ్‌ ఫోరం అనే సంస్థ పేర్కొంది. ప్రధాన బెట్టింగ్‌ యాప్‌ల డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది.

ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లు
దేశంలో వ్యవస్థీకృతమైన మాఫియా పకడ్బందీగా బెట్టింగ్‌ దందా సాగిస్తోంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా పల్లెలకు కూడా ఈ రాకెట్‌ విస్తరించింది. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ లేని ఉత్సుకతను పెంచేలా దందాను నడుపుతోంది. 

టాస్‌తో మొదలుపెట్టి.. బంతి బంతికి బెట్టింగ్‌ నిర్వహిస్తోంది. ఒక్కో పందెం రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉంటోంది. కొన్నేళ్ల క్రితం క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, లాడ్జిలలో ముందుగా డబ్బులు పెట్టి బెట్టింగ్‌ కాసేవారు. డిజిటల్‌ చెల్లింపుల యుగంలో బెట్టింగ్‌ దందా మరింత సులభతరమైంది.

అత్యాధునిక టెక్నాలజీ..
బెట్టింగ్‌ మాఫియా 5జీ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ (Cloud Computing) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతూ యాప్‌లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. స్పోర్ట్స్‌ రాడార్, బెట్‌ 365 వంటివి మ్యాచ్‌ల రియల్‌ టైమ్‌ డేటా ఫీడ్‌ను సెకనులో వెయ్యో వంతు (మిల్లీ సెకన్‌) సమయంలో అప్‌డేట్‌ చేస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ టూల్స్‌తో బెట్టింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు. తద్వారా ప్రతి బాల్‌కు దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో భారీగా బెట్టింగులు కాసేలా చేస్తున్నారు.

పుట్టుగొడుగుల్లా యాప్‌లు.. సోషల్‌ మీడియాతో వల
దందా టర్నోవర్‌కు తగ్గట్టే దేశంలో బెట్టింగ్‌ యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగాక బెట్టింగ్‌ మాఫియా దందాకు అడ్డే లేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ముంచెత్తుతున్నాయి. మెగాపరి, మోస్ట్‌బెల్, పరిసేస, పర్‌ మ్యాచ్, బీసీ డాట్‌గేమ్, 22 బెట్స్, 10సీ సీఆర్‌ఐసీ, మెల్‌బెట్, మేట్‌బెట్, 1 ఎక్స్‌బెట్, రాజా బెట్స్, స్టేక్‌ డాట్‌కామ్, డఫ్పా బెట్‌ ఇలా ఎన్నో యాప్‌ల ప్రకటనలు వరదలా వచ్చి పడుతున్నాయి. 

కొన్నయితే ఇన్‌ఫ్లుయెన్సర్లతో వల విసరుతున్నాయి. రూ.100 పెడితే రూ.వేయి ఇస్తాం అంటూ.. కొత్త కస్టమర్లకు రూ.100 నుంచి రూ.500 వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఊబిలోకి గుంజుతున్నాయి. ఐపీఎల్‌ సీజన్‌లో దాదాపు 75 యాప్‌లు బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్టు డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ వెల్లడించింది.

కమీషనే రూ.వెయ్యి కోట్లు
భారీగా డబ్బు రొటేషన్‌ అవుతుంది తప్ప.. ఐపీఎల్‌ బెట్టింగ్‌ల ద్వారా సామాన్యులు డబ్బు సంపాదించిన దాఖలాలు లేవన్నది నిజం. నిర్వాహకులు మాత్రం పందెం మొత్తంపై కనీసం 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్‌ దండుకుంంటున్నారు. ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌ దందా టర్నోవర్‌ రూ.10 వేల కోట్లు అనుకుంటే యాప్‌ల నిర్వాహకులు కమీషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లు వెనకేస్తున్నారు.

అంతా మనోళ్లే.. చూసీ చూడనట్లు పొండి
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌ మాఫియా చెలరేగుతోంది. ఎంపిక చేసిన హోటళ్లు, లాడ్జీలు, అపార్టుమెంట్ల కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తోంది. టీడీపీ కూటమిలోని కీలక నేతల ప్రధాన అనుచరులే జిల్లాల్లో బెట్టింగ్‌ దందాకు సూత్రధారులు. 

గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల కార్యాలయాలు బెట్టింగ్‌ మాఫియాకు అనుకూలంగా పోలీసులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.
⇒ విజయవాడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ టీడీపీ నేత పోలీసులకు ఫోన్‌ చేసి ‘అదంతా మనవాళ్లదే’ అని చెప్పడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. 

⇒ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి ప్రజాప్రతినిధి సోదరుడే బెట్టింగ్‌ మాఫియాకు కింగ్‌ పిన్‌.
⇒ ఏలూరు జిల్లాలో కోడి పందేల నిర్వాహకుడిగా గుర్తింపు పొందిన టీడీపీకి చెందిన సీనియర్‌ ప్రజాప్రతినిధి వర్గం ప్రస్తుతం బెట్టింగ్‌ దందాను సాగిస్తోంది.
⇒ వైఎస్సార్‌ కడప జిల్లాలో అత్యంత వివాదాస్పదుడైన కూటమి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరులోని బెట్టింగ్‌ రాకెట్‌తో మిలాఖత్‌ అయి..  జిల్లాలో దందా నడుపుతున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో రూ.500 కోట్ల దందా వీరి లక్ష్యం కావడం గమనార్హం.

పందెంరాయుళ్లు కాదు.. బాధితులే

క్రికెట్‌ బెట్టింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారుల నుంచి మెకానిక్‌లు, హోటళ్లలో పనిచేసే యువకులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు చివరకు కనీస సంపాదన లేని విద్యార్థులు కూడా బాధితులే. చేతిలోని డబ్బే కాదు.. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని మరీ బజారున పడుతున్నారు. బెట్టింగ్‌ కోసం కాల్‌ మనీ రాకెట్‌ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి, తీర్చలేక తీవ్ర అవమానం, ఇబ్బందులు పడుతున్నవారూ భారీగా ఉన్నారు.
n మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో అన్నదమ్ములు సూర్యనారాయణ, ఉమామహేశ్‌ రూ.45 లక్షలు కోల్పోయారు. అప్పులు తీర్చలేమని గ్రహించి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించారు. సూర్యనారాయణ చనిపోగా అపస్మాకర స్థితిలో ఉన్న ఉమామహేశ్‌ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
n హైదరాబాద్‌లో బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
n బిహార్‌లో వ్యాపారి బెట్టింగ్‌లో రూ.2 కోట్ల విలువైన విల్లాను కోల్పోయాడు.
n కర్ణాటకలో ఓ వ్యక్తి రూ.కోటి నష్టపోగా.. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంది.
n తమిళనాడు కోయంబత్తూరులో రూ.90 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి జీవితాన్నే బలి తీసుకున్నాడు.

బలహీన చట్టాలతో చెలరేగుతున్న మాఫియా
దేశంలో జూదం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో అధికారికంగా, అనధికారికంగా బరి తెగిస్తున్న మాఫియాను కట్టడి చేసేందుకు సరైన చట్టాలు లేవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నిషేధించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల నుంచి నిర్వహణ సాగిస్తున్న మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్రమే ఏకీకృత చట్టం చేయాల్సిన అవసరం ఉంది.

జూదానికి అడ్డుకట్ట వేసేందుకు  దేశంలో ఉన్న చట్టాలు.. వాటి లోపాలు..

జూద కార్యకలాపాల నిరోధక చట్టం–1867: 
బ్రిటీష్‌ కాలంలో చేసిన ఈ చట్టం జూద గృహాలను నిషేధిస్తోంది. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా చట్టాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఆన్‌లైన్‌ జూదాలు, ఇతర అంశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి రావు.

రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు: 
సిక్కిం, గోవా, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలు కొన్ని  జూదానికి అనుమతిస్తూ ప్రత్యేక చట్టాలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో లైసెన్సు తీసుకుని దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ దందా నడిపిస్తున్నారు. దీంతో కట్టడి చేసేందుకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఐటీ చట్టం 2000: 
సైబర్‌ నేరాలను నిరోధించేందుకు ఉద్దేశించినది. దీంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిరోధించడం సాధ్యమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ సైబర్‌ నేరాల పరిధిలోకి వస్తాయా రావా అని స్పష్టత లేకపోవడమే అందుకు కారణం.

బెట్టింగా..!? స్కిల్‌ గేమా...!?
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అన్నది జూదమా కాదా అన్న అంశంపై దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. ‘గేమ్‌ ఆఫ్‌ స్కిల్‌’ అన్నది ఒక క్రీడగా భావించాలి తప్ప జూదంగా కాదని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఆ మేరకు ‘గేమ్‌ ఆఫ్‌ స్కిల్‌’గా పేకాట క్లబ్బులకు అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కిల్‌ గేమ్‌ అని వాదిస్తూ తమపై నిషేధం చెల్లదని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నిరోధించే అంశం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది.  

కఠిన చట్టమే పరిష్కార మార్గం...
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ‘బెట్టింగ్‌– గ్యాంబ్లింగ్‌ రెగ్యులేషన్‌ బిల్లు’ పెండింగులో ఉంది. దీనిపై మరింత న్యాయ సలహాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ నిర్వచనం, బిల్లులోని అంశాల పరిధి, న్యాయ సమీక్షకు నిలవడంపై మరింత లోతుగా సమాలోచనలు జరపాలని చూస్తోంది. పకడ్బందీ చట్టంతోనే బెట్టింగ్‌ మాఫియాకు అడ్డుకట్ట  సాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement