ipl season
-
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్లు (డబుల్ హెడర్) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్లో కోల్కతా నైట్రైడర్స్తో జరగాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు. -
జీవితాలే బెట్.. మాఫియా క్రికెట్
ఫోర్ కొడితే చప్పట్లు.. సిక్స్ కొడితే కేకలు.. వికెట్ పడితే అరుపులు.. గెలుపు ఓటములపై ఉత్కంఠ..! ఇవీ సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో ఆస్వాదించే అంశాలు.. అయితే, ఇదంతా తెర ముందు దృశ్యం..! మరి తెరవెనుకో..? టాస్కు ముందు.. పరుగు తీస్తే.. ఫోర్ కొడితే.. సిక్స్ బాదితే.. మ్యాచ్లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ బెట్టింగ్..! బెట్టింగ్..! అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. చివరికి ఏ టీమ్ మ్యాచ్ గెలిచినా ఓడేది మాత్రం కచి్చతంగా పందెం కాసినవారే. అది ఎంతగా అంటే..? బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.. అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్ తోనే జీవితం తలకిందులైపోతోంది. సాక్షి, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐపీఎల్ (IPL) సందడితో పాటు.. దేశంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఇన్నింగ్స్ కూడా మొదలవుతోంది. ఆట పట్ల సగటు భారతీయుడి వ్యామోహమే పెట్టుబడిగా ఊబిలోకి లాగుతోంది. చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దిగజారుస్తోంది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ తాజా నివేదిక ప్రకారం ఒక్క ఐపీఎల్ సీజన్లోనే దేశంలో వంద బిలియన్ డాలర్ల (రూ.8,500 కోట్లు పైగా) బెట్టింగ్ దందా సాగుతోంది. గత 17 సీజన్లను విశ్లేషించి ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఏటా బెట్టింగ్ దందా 30 శాతం చొప్పున పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుత 18వ సీజన్లో బెట్టింగ్ అత్యంత గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసింది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఖాయమని స్పష్టం చేసింది. ఏటా ఐపీఎల్ సీజన్లో 34 కోట్లమంది బెట్టింగ్లో పాల్గొంటున్నారని ఇండియా ఛేంజ్ ఫోరం అనే సంస్థ పేర్కొంది. ప్రధాన బెట్టింగ్ యాప్ల డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది.ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లుదేశంలో వ్యవస్థీకృతమైన మాఫియా పకడ్బందీగా బెట్టింగ్ దందా సాగిస్తోంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లు, ఆన్లైన్ ద్వారా పల్లెలకు కూడా ఈ రాకెట్ విస్తరించింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ లేని ఉత్సుకతను పెంచేలా దందాను నడుపుతోంది. టాస్తో మొదలుపెట్టి.. బంతి బంతికి బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఒక్కో పందెం రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉంటోంది. కొన్నేళ్ల క్రితం క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, లాడ్జిలలో ముందుగా డబ్బులు పెట్టి బెట్టింగ్ కాసేవారు. డిజిటల్ చెల్లింపుల యుగంలో బెట్టింగ్ దందా మరింత సులభతరమైంది.అత్యాధునిక టెక్నాలజీ..బెట్టింగ్ మాఫియా 5జీ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతూ యాప్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. స్పోర్ట్స్ రాడార్, బెట్ 365 వంటివి మ్యాచ్ల రియల్ టైమ్ డేటా ఫీడ్ను సెకనులో వెయ్యో వంతు (మిల్లీ సెకన్) సమయంలో అప్డేట్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ టూల్స్తో బెట్టింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. తద్వారా ప్రతి బాల్కు దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో భారీగా బెట్టింగులు కాసేలా చేస్తున్నారు.పుట్టుగొడుగుల్లా యాప్లు.. సోషల్ మీడియాతో వలదందా టర్నోవర్కు తగ్గట్టే దేశంలో బెట్టింగ్ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) విస్తృతి పెరిగాక బెట్టింగ్ మాఫియా దందాకు అడ్డే లేదు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్లలో బెట్టింగ్ యాప్ల ప్రకటనలు ముంచెత్తుతున్నాయి. మెగాపరి, మోస్ట్బెల్, పరిసేస, పర్ మ్యాచ్, బీసీ డాట్గేమ్, 22 బెట్స్, 10సీ సీఆర్ఐసీ, మెల్బెట్, మేట్బెట్, 1 ఎక్స్బెట్, రాజా బెట్స్, స్టేక్ డాట్కామ్, డఫ్పా బెట్ ఇలా ఎన్నో యాప్ల ప్రకటనలు వరదలా వచ్చి పడుతున్నాయి. కొన్నయితే ఇన్ఫ్లుయెన్సర్లతో వల విసరుతున్నాయి. రూ.100 పెడితే రూ.వేయి ఇస్తాం అంటూ.. కొత్త కస్టమర్లకు రూ.100 నుంచి రూ.500 వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఊబిలోకి గుంజుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో దాదాపు 75 యాప్లు బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వెల్లడించింది.కమీషనే రూ.వెయ్యి కోట్లుభారీగా డబ్బు రొటేషన్ అవుతుంది తప్ప.. ఐపీఎల్ బెట్టింగ్ల ద్వారా సామాన్యులు డబ్బు సంపాదించిన దాఖలాలు లేవన్నది నిజం. నిర్వాహకులు మాత్రం పందెం మొత్తంపై కనీసం 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్ దండుకుంంటున్నారు. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ దందా టర్నోవర్ రూ.10 వేల కోట్లు అనుకుంటే యాప్ల నిర్వాహకులు కమీషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లు వెనకేస్తున్నారు.అంతా మనోళ్లే.. చూసీ చూడనట్లు పొండిప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ మాఫియా చెలరేగుతోంది. ఎంపిక చేసిన హోటళ్లు, లాడ్జీలు, అపార్టుమెంట్ల కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తోంది. టీడీపీ కూటమిలోని కీలక నేతల ప్రధాన అనుచరులే జిల్లాల్లో బెట్టింగ్ దందాకు సూత్రధారులు. ⇒ గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల కార్యాలయాలు బెట్టింగ్ మాఫియాకు అనుకూలంగా పోలీసులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.⇒ విజయవాడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ టీడీపీ నేత పోలీసులకు ఫోన్ చేసి ‘అదంతా మనవాళ్లదే’ అని చెప్పడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. ⇒ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి ప్రజాప్రతినిధి సోదరుడే బెట్టింగ్ మాఫియాకు కింగ్ పిన్.⇒ ఏలూరు జిల్లాలో కోడి పందేల నిర్వాహకుడిగా గుర్తింపు పొందిన టీడీపీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి వర్గం ప్రస్తుతం బెట్టింగ్ దందాను సాగిస్తోంది.⇒ వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత వివాదాస్పదుడైన కూటమి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరులోని బెట్టింగ్ రాకెట్తో మిలాఖత్ అయి.. జిల్లాలో దందా నడుపుతున్నారు. ఈ సీజన్లో రాష్ట్రంలో రూ.500 కోట్ల దందా వీరి లక్ష్యం కావడం గమనార్హం.పందెంరాయుళ్లు కాదు.. బాధితులేక్రికెట్ బెట్టింగ్లో ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారుల నుంచి మెకానిక్లు, హోటళ్లలో పనిచేసే యువకులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు చివరకు కనీస సంపాదన లేని విద్యార్థులు కూడా బాధితులే. చేతిలోని డబ్బే కాదు.. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని మరీ బజారున పడుతున్నారు. బెట్టింగ్ కోసం కాల్ మనీ రాకెట్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి, తీర్చలేక తీవ్ర అవమానం, ఇబ్బందులు పడుతున్నవారూ భారీగా ఉన్నారు.n మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో అన్నదమ్ములు సూర్యనారాయణ, ఉమామహేశ్ రూ.45 లక్షలు కోల్పోయారు. అప్పులు తీర్చలేమని గ్రహించి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించారు. సూర్యనారాయణ చనిపోగా అపస్మాకర స్థితిలో ఉన్న ఉమామహేశ్ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.n హైదరాబాద్లో బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.n బిహార్లో వ్యాపారి బెట్టింగ్లో రూ.2 కోట్ల విలువైన విల్లాను కోల్పోయాడు.n కర్ణాటకలో ఓ వ్యక్తి రూ.కోటి నష్టపోగా.. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంది.n తమిళనాడు కోయంబత్తూరులో రూ.90 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి జీవితాన్నే బలి తీసుకున్నాడు.బలహీన చట్టాలతో చెలరేగుతున్న మాఫియాదేశంలో జూదం, ఆన్లైన్ బెట్టింగ్లో అధికారికంగా, అనధికారికంగా బరి తెగిస్తున్న మాఫియాను కట్టడి చేసేందుకు సరైన చట్టాలు లేవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల నుంచి నిర్వహణ సాగిస్తున్న మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్రమే ఏకీకృత చట్టం చేయాల్సిన అవసరం ఉంది.జూదానికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో ఉన్న చట్టాలు.. వాటి లోపాలు..జూద కార్యకలాపాల నిరోధక చట్టం–1867: బ్రిటీష్ కాలంలో చేసిన ఈ చట్టం జూద గృహాలను నిషేధిస్తోంది. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా చట్టాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్ జూదాలు, ఇతర అంశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి రావు.రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు: సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు కొన్ని జూదానికి అనుమతిస్తూ ప్రత్యేక చట్టాలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో లైసెన్సు తీసుకుని దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. దీంతో కట్టడి చేసేందుకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.ఐటీ చట్టం 2000: సైబర్ నేరాలను నిరోధించేందుకు ఉద్దేశించినది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ను నిరోధించడం సాధ్యమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయా రావా అని స్పష్టత లేకపోవడమే అందుకు కారణం.బెట్టింగా..!? స్కిల్ గేమా...!?ఆన్లైన్ బెట్టింగ్ అన్నది జూదమా కాదా అన్న అంశంపై దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. ‘గేమ్ ఆఫ్ స్కిల్’ అన్నది ఒక క్రీడగా భావించాలి తప్ప జూదంగా కాదని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఆ మేరకు ‘గేమ్ ఆఫ్ స్కిల్’గా పేకాట క్లబ్బులకు అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ స్కిల్ గేమ్ అని వాదిస్తూ తమపై నిషేధం చెల్లదని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఆన్లైన్ బెట్టింగ్ను నిరోధించే అంశం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. కఠిన చట్టమే పరిష్కార మార్గం...ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ‘బెట్టింగ్– గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్ బిల్లు’ పెండింగులో ఉంది. దీనిపై మరింత న్యాయ సలహాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వచనం, బిల్లులోని అంశాల పరిధి, న్యాయ సమీక్షకు నిలవడంపై మరింత లోతుగా సమాలోచనలు జరపాలని చూస్తోంది. పకడ్బందీ చట్టంతోనే బెట్టింగ్ మాఫియాకు అడ్డుకట్ట సాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్, తేడా వస్తే తాటతీస్తాం.. బుకీలకు పోలీసుల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్-18 మ్యాచ్ కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ముస్తాబైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద సందడి షురూ అయ్యింది.ఈ తరుణంలో హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం 2700 మంది పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. 450 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సీజన్లో మొత్తం 10 జట్లు.. మొత్తం 73 మ్యాచ్లు ఆడనున్నాయి. మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ బుకీలు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్,రిసార్ట్స్, రెస్టారెంట్స్ క్లబ్స్పై ఓ కన్నేశారు. ఏమాత్రం తేడా వచ్చినా బెట్టింగ్ రాయుళ్ల తాటతీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు39వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో.. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలనూ అర్ధరాత్రి వరకూ పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..సన్రైజర్స్ సత్తా చాటుతుందా ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలు కానుంది. దీంతో హైదరాబాద్ గట్టుపై బోణీ కొట్టేదెవరని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..ఈ సారి కూడా సన్రైజర్స్ సత్తా చాటుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పట్టిష్టంగా ఇరు జట్లుసన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తుండగా..ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడంతో..హెడ్, అభిషేక్, క్లాసెన్లు ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్లు ఆడగా…అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్లలో విజయం సాధించింది. -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సింథి కాలనీకి చెందిన పడాల మహేష్ బాబు ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ కోసం కొత్త పంథా అనుసరించాడు. తన ఎంజీ హెక్టర్ వాహనాన్నే అడ్డాగా చేసుకుని అందులోనే అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఇంత పక్కాగా ప్లాన్ చేసినా... మధ్య మండల టాస్క్ఫోర్స్కు ఏడుగురు ముఠా సభ్యులతో సహా చిక్కాడు. అదనపు డీసీపీ పి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. తన 19 ఏళ్ల కుమారుడినీ కలెక్షన్ ఏజెంట్గా మార్చుకోవడం గమనార్హం. సింథికాలనీకి చెందిన పడాల మహేష్ బాబు వృత్తి కన్స్ట్రక్షన్ వ్యాపారం. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో వ్యవస్థీకృతంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించడాన్ని ప్రవృత్తిగా మార్చుకుని ప్రధాన బుకీగా మారాడు. డెన్ ఏర్పాటు చేస్తే పోలీసులకు చిక్కుతామని తన ఎంజీ హెక్టర్ వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. అందులోనే ప్రత్యేకంగా బ్యాటరీతో పాటు వైఫై రూటర్లు అమర్చుకున్నాడు. ల్యాప్టాప్, కాల్ కనెక్టర్ బాక్స్, రికార్డర్లు, టీవీ, అకౌంట్ పుస్తకాలు.. ఇలా బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన సమస్తం కారులోనే ఉండేలా చూసుకున్నాడు. తన కుమారుడైన జతిన్ను కలెక్షన్ ఏజెంట్గా మార్చుకున్నాడు. నగరానికి చెందిన శ్యామ్ సుందర్ (సబ్ బుకీ), నవాజ్ ఖాన్ (ఏజెంట్), మహేంద్ర కుమార్ అగర్వాల్ (లైన్ ఆపరేటర్), ఆనంద్ (ల్యాప్టాప్ ఆపరేటర్), నవీన్ (అకౌంటెంట్), గోవింద్ యాదవ్లు (కలెక్షన్ బాయ్) మహేష్ వద్ద నెల జీతానికి పని చేస్తున్నారు. వీరిలో కొందరు మహేష్తో పాటు అతడి వాహనంలో సంచరిస్తూ ఫోన్ కాల్స్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్స్ అంగీకరిస్తున్నారు. కాల్ కనెక్టర్కు వచ్చే ప్రతి కాల్ను రికార్డు చేసుకుంటున్నారు. తెలిసిన వారు, వారి సిఫార్సుతో వచ్చిన వారిని మాత్రమే పంటర్లుగా అంగీకరిస్తున్నారు. పందాల నిర్వహణలో క్రెడిట్ సౌకర్యాన్నీ కల్పించేవాడు. ఇతడి పంటర్లు వారం రోజుల పాటు ఎలాంటి మొత్తం చెల్లించకుండా బెట్టింగ్లో పాల్గొనవచ్చు. ఆపై అకౌంటెంట్ లెక్కలు చూస్తాడు. దాని ప్రకారం డబ్బు తీసుకోవడమో, చెల్లించడమో ఏజెంట్ల ద్వారా చేస్తుంటాడు. ఇతడి ముఠాపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్, ఎస్సైలు సీహెచ్.నవీన్ కుమార్, ఎస్.సాయి కిరణ్ రామ్గోపాల్పేట పోలీసులతో కలిసి వలపన్నారు. సింథికాలనీలోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో మహేష్, అతడి కుమారుడు జతిన్లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.4.5 లక్షల నగదు, వాహనం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు) -
ధోని మంత్రం పని చేయలేదు
ఒకప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు అతను దిగ్గజాల్లాంటి సీనియర్లతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు కుర్రాళ్లను ఎందుకు ఆడించడం లేదంటే వారిలో తనకు కావాల్సిన ‘మెరుపు’ కనిపించలేదని చెబుతున్నాడు. ఇన్నాళ్లూ ధోని ఏం వ్యూహం రచించినా అదో అద్భుతంగా అనిపించింది. ఎలాంటి ప్రణాళిక వేసినా ఆహా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అనామక బౌలర్ కూడా ధోని సారథ్యంలో ఆడితే అసాధారణంగా కనిపించేవాడు. కానీ ఈసారి ఐపీఎల్లో అలాంటి చమక్కులు ఏమీ కనిపించలేదు. ఒక సీజన్లో జట్టు విఫలం కావడంలో తప్పు లేదు కానీ చెన్నై జట్టు ఆట చూస్తే మరీ ఇలానా... అన్నట్లుగా అభిమానులు సైతం నిట్టూర్చే విధంగా సాగడమే విషాదం. సాక్షి క్రీడా విభాగం: తాజా సీజన్లో ధోనితోపాటు జట్టు సహచరులకు కూడా ఏదీ కలిసి రాలేదు. లీగ్లో మూడుసార్లు చాంపియన్గా నిలిచిన జట్టు పేరుకు ఈసారి మూడు మ్యాచ్లు గెలిచినా... ఒక్కసారి కూడా తమ స్థాయిని ప్రదర్శించే ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నిషేధం తర్వాత తీవ్ర ఒత్తిడిలో 2018లో బరిలోకి దిగి చాంపియన్గా నిలవడంతో పాటు గత ఏడాది ఫైనల్ కూడా చేరగలిగిన టీమ్ ఇంతగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. వ్యూహాలే గందరగోళం... ఐపీఎల్లో ఏ జట్టు విజయంలోనైనా పవర్ప్లేలో చేసే పరుగులు అత్యంత కీలకం. కానీ ఈసారి పవర్ప్లేలో చెన్నై ఆట అన్ని మ్యాచ్లలో టెస్టులను తలపించింది. తొలి 6 ఓవర్లలో చెన్నైకంటే తక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. వికెట్లు కాపాడుకొని... చివర్లో చెలరేగిపోవచ్చనే వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. ఆఖర్లో వచ్చేసరికి ఒత్తిడి పెరిగిపోయి సాధారణ లక్ష్యాలను కూడా ఛేదించలేక సీఎస్కే చతికిలపడింది. ఆఖరి బంతి వరకు మ్యాచ్ను తీసుకెళ్లి కూడా అద్భుతంగా గెలిపించవచ్చని గతంలో ఎన్నోసార్లు నిరూపించిన ధోని బ్యాట్ ఈసారి మూగబోయింది. చేయాల్సిన పరుగుల రన్రేట్ విపరీతంగా పెరిగిపోయి చివరి మెట్టుపై బోల్తా పడాల్సిన పరిస్థితి వచి్చంది. బ్యాట్స్మెన్ వైఫల్యంతో సూపర్ కింగ్స్ నుంచి ‘భారీ స్కోరు’ అనే మాట వినిపించడమే గగనంగా మారింది. ఆదివారం సూపర్ ఓవర్ల తర్వాత ఒక చెన్నై అభిమాని ‘మా జట్టుకు ఎప్పుడైనా సూపర్ ఓవర్ ఆడే అవకాశమే రాకపోతే మంచిది. ఎందుకంటే వాళ్లు నిలదొక్కుకునే లోపే ఓవర్ ముగిసిపోతుంది’ అంటూ చేసిన సరదా వ్యాఖ్య పరిస్థితిని చూపిస్తోంది. అందరూ అందరే... సీజన్లో చెన్నై 17 మంది ఆటగాళ్లను బరిలోకి దించింది. ఒకటి రెండు వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టుగా చూస్తే అందరి వైఫల్యం కనిపిస్తుంది. ‘సీనియర్ సిటిజన్స్ టీమ్’ అంటూ మొదటి నుంచీ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపించినా మేనేజ్మెంట్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే సమస్య వయసు గురించి కాదు. సత్తా ఉంటే ఏ వయసువారైనా చెలరేగిపోగలరు. కానీ చెన్నై జట్టు పరిస్థితి భిన్నం. ప్రధాన ఆటగాళ్లలో సగం మంది రిటైర్డ్ లేదా సెమీరిటైర్డ్లాంటివారు ఉన్నారు. లీగ్కు నెల రోజుల ముందు అంతా ఒక్క చోటికి చేరడం, కొంత సాధన చేయడం, ఐపీఎల్ ఆడేయడం... కానీ వేర్వేరు కారణాలతో ఈసారి అది పని చేయలేదు. ఆటగాళ్లకు ‘కంటిన్యుటీ’ సమస్య బాగా కనిపించింది. జట్టుకు దిక్సూచి లాంటి ధోనినే స్వయంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడు. అందుకే ఎంత ప్రయతి్నంచినా ఆ షాట్లలో పదును కనిపించలేదు, బ్యాటింగ్లో చురుకుదనం కనిపించలేదు. వాట్సన్, బ్రేవో ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఇతర లీగ్లలో పాల్గొంటున్నా... ఐపీఎల్తో పోలిస్తే వాటి ప్రమాణాలు పేలవం. కేదార్ జాదవ్ సంగతి సరే సరి. మొత్తం జట్టులో అన్ని ఫార్మాట్లలో ఉన్న భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఒక్కడే. అందువల్లే కావచ్చు అతనొక్కడిలోనే కాస్త ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇదే తరహాలో డుప్లెసిస్ మెరుగైన ప్రదర్శన కనబర్చగా, తనకున్న అనుభవాన్ని బట్టి చూస్తే స్యామ్ కరన్ ఆటను కాస్త మెచ్చుకోవచ్చు. సర్వం తానే అయి వ్యవహరించే ధోని... రైనా, హర్భజన్లాంటి ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దూరమైతే, కనీసం వారి స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన కూడా చేయకపోవడం తనపై తనకు ఉన్న అతి నమ్మకమని చెప్పవచ్చు. మొత్తం మార్చేస్తారా... మిగిలిన నాలుగు మ్యాచ్లు గెలిచి రేసులో నిలిచేందుకు ప్రయతి్నస్తాం అనే మొహమాటపు మాటకు పోకుండా తమ పని ముగిసిపోయిందని ధోని స్పష్టంగానే చెప్పేశాడు. కాబట్టి ఇక దృష్టి వచ్చే సీజన్ మీదే. నిబంధనల ప్రకారం 2018 వేలంలో తీసుకున్న ఆటగాళ్ల ఒప్పందం 2020తో ముగుస్తుంది. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ వేలం జరిగాలి. అయితే ఏప్రిల్లో జరిగే ఐపీఎల్కు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ సారికి వేలం నిర్వహించరాదనే ఆలోచనతో బీసీసీఐ ఉన్నట్లు వినిపించింది. అయితే ఇంతటి ‘భారమైన’ జట్టుతో చెన్నై 2021 లీగ్ ఆడే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి ఆ జట్టు వేలం కోసం పట్టుబడవచ్చు. గత ఫలితాలు, చరిత్రను పక్కన పెడితే ఇప్పుడున్న టీమ్లో సమూల మార్పులు చేసి వస్తేనే చెన్నై మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఈసారి ధోని ఆట చూస్తే వచ్చేసారి ఆటగాడిగా కొనసాగుతాడా అనేది సందేహమే కానీ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలను బట్టి అది ఉండవచ్చు. అయితే తాజా సీజన్ మాత్రం అభిమానులకు చేదు జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. ధోని పేద్ద పిస్తా అయితే కావచ్చు. అతను గొప్ప ఆటగాడు కూడా. కానీ కుర్రాళ్లలో తనకు కావాల్సిన మెరుపు కనిపించలేదని అతను చేసిన వ్యాఖ్యను నేను ఏమాత్రం సమరి్థంచను. అసలు అతని ఆలోచనే అర్థరహితం. ఫలితాలు కాదు ప్రక్రియ ముఖ్యం అనే ధోరణే అర్థం లేనిది. ఇచ్చిన ఒక అవకాశంలో రాణించిన జగదీశన్లో నీకు కనిపించని మెరుపు జాదవ్, చావ్లాలలో కనిపించిందా. అసలు జాదవ్ మైదానంలో దిగాలంటే ఒక స్కూటర్ కావాల్సిందేమో. –ధోనిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్య -
హ్యాట్రిక్ 'పంజా'...
ఐపీఎల్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట ఏడు మ్యాచ్లాడి ఆరింట ఓడింది. ఇక ప్లేఆఫ్స్కు కష్టమే అనుకున్న దశలో పంజా విసురుతోంది. దీంతో తర్వాత మూడు మ్యాచ్ల్ని వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. పంజాబ్ గెలిచిన వరుస మూడు మ్యాచ్లు పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లపై రావడం విశేషం. ఈ గెలుపుతో అట్టడుగున ఉన్న కింగ్స్ మొత్తం నాలుగు విజయాలతో ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకింది. దుబాయ్: ఢిల్లీ ఆటకు పరుగుల బాట చూపించిన శిఖర్ ధావన్ అజేయ శతకం... సుడి‘గేల్’, పూరన్ మెరుపుల ముందు చిన్నబోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (61 బంతుల్లో 106 నాటౌట్) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు), గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. ఆడింది ఒక్కడే... ఢిల్లీ ఇన్నింగ్స్ను ఆరంభం నుంచి పరుగెత్తించింది... మెరిపించింది... నడిపించింది... ధావన్ ఒక్కడే! పృథ్వీ షాతో ఆట ఆరంభించిన ఈ ఓపెనరే క్యాపిటల్స్ ఇన్నింగ్స్కు ఆది, అంతాలయ్యాడు. ఇన్నింగ్స్ రెండో బంతి నుంచి ధావన్ దంచుడు ఫోర్తో మొదలైంది. ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఓ పరుగు దాకా సాగింది. ఈ మధ్యలో 61 బంతులు అంటే సగం ఓవర్లు ధావన్ ఆడాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఇక మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఓపెనింగ్ సహచరుడు పృథ్వీ షా (7), కెప్టెన్ అయ్యర్ (14), పంత్ (14), స్టొయినిస్ (9), హెట్మైర్ (10) అందరూ ప్రత్యర్థి బౌలింగ్కు తలవంచారు. మ్యాక్స్వెల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఎదుర్కొన్న∙ధావన్ బౌండరీతో ఆట మొదలుపెట్టాడు. ఐదో బంతికి భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఓవర్లో 13 పరుగులు రాగా... డజను పరుగులు ధావన్వే! ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేదాకా అతని జోరులో, జట్టు స్కోరులో ఇదే కనబడింది. 28 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న ధావన్... 57 బంతుల్లోనే ‘శత’క్కొట్టేశాడు. 5.3 ఓవర్లో అతని పరుగుతోనే జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపయ్యాక 13వ ఓవర్లో ధావన్ సిక్సర్తో ఢిల్లీ 100 పరుగులను అధిగమించింది. చివరకు 19వ ఓవర్లో అతను తీసిన 2 పరుగులతో అతని శతకం, జట్టు స్కోరు 150 పరుగులు పూర్తయ్యాయి. ఇలా క్యాపిటల్స్ జట్టు ప్రతి 50 పరుగుల మజిలీని ధావన్ బ్యాట్తోనే చేరింది. గేల్, పూరన్ ధనాధన్... కింగ్స్ లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెపె్టన్ రాహుల్ (15) వికెట్ను ఆరంభంలోనే కోల్పోయింది. ఈ దశలో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన గేల్ సుడిగాలి ఆట ఆడేశాడు. అతని హోరుతో 4 ఓవర్లలో 24/1 స్కోరు కాస్తా ఒక్క ఓవర్ పూర్తయ్యేసరికే గిర్రున తిరిగింది. తుషార్ వేసిన ఈ ఐదో ఓవర్ను అసాంతం ఆడిన గేల్ 4, 4, 6, 4, 6, వైడ్, 1లతో హోరెత్తించాడు. 26 పరుగులు ధనాధన్గా వచ్చేశాయంతే! కింగ్స్ స్కోరు 50 పరుగులకు చేరింది. కానీ తర్వాతి ఓవర్లో అశి్వన్... గేల్ మెరుపులకు ఫుల్స్టాప్ పెట్టాడు. అదే ఓవర్లో మయాంక్ (5) రనౌటయ్యాడు. 7 ఓవర్లలో పంజాబ్ స్కోరు 57/3. ఢిల్లీ శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం. కానీ పూరన్ ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లాడు. కాస్త కుదురుకున్నాక బ్యాట్ ఝళిపించడంతో పరుగులు చకచకా వచ్చాయి. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో పూరన్ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే రబడ అతన్ని ఔట్ చేశాడు. ఢిల్లీకి ఆశలు రేపినా... మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 32; 3 ఫోర్లు), హుడా (22 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), నీషమ్ (8 బంతుల్లో 10 నాటౌట్; సిక్స్) జాగ్రత్త గా ఆడటంతో ఓవర్ మిగిలుండగానే పంజాబ్ నెగ్గింది. టి20 క్రికెట్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన తొమ్మిదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో వార్నర్ (2011), ఉన్ముక్త్ చంద్ (2013), ల్యూక్ రైట్ (2014), మైకేల్ క్లింగర్ (2015), పీటర్సన్ (2015), మార్కో మరైస్ (2018), రీజా హెండ్రిక్స్ (2018), ఇషాన్ కిషన్ (2019) కూడా ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ ఒకే సీజన్లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో 2016లో కోహ్లి (బెంగళూరు) ఏకంగా 4 సెంచరీలు చేయగా... గేల్ (2011–బెంగళూరు), ఆమ్లా (2017–పంజాబ్), వాట్సన్ (2018–చెన్నై) రెండు సెంచరీల చొప్పున చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మ్యాక్స్వెల్ (బి) నీషమ్ 7; ధావన్ (నాటౌట్) 106, అయ్యర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 14, పంత్ (సి) మయాంక్ (బి) మ్యాక్స్వెల్ 14, స్టొయినిస్ (సి) మయాంక్ (బి) షమీ 9; హెట్మైర్ (బి) షమీ 10; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–25, 2–73, 3–106, 4–141, 5–164. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–31–1, షమీ 4–0–28–2, అర్‡్షదీప్ 3–0–30–0, నీషమ్ 2–0–17–1, మురుగన్ అశ్విన్ 4–0–33–1, రవి బిష్ణోయ్ 3–0–24–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) సామ్స్ (బి) అక్షర్ 15; మయాంక్ (రనౌట్) 5; గేల్ (బి) అశ్విన్ 29; పూరన్ (సి) పంత్ (బి) రబడ 53; మ్యాక్స్వెల్ (సి) పంత్ (బి) రబడ 32; దీపక్ హుడా (నాటౌట్) 15; నీషమ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–17, 2–52, 3–56, 4–125, 5–147. బౌలింగ్: సామ్స్ 4–0–30–0, రబడ 4–0–27–2, అక్షర్ 4–0–27–1, తుషార్ 2–0–41–0, అశి్వన్ 4–0–27–1, స్టొయినిస్ 1–0–14–0. -
ఐపీఎల్లో అతనొక్కడే!!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రికార్డులు, మైలురాళ్లు విరాట్ కోహ్లికి సర్వసాధారణమయ్యాయి. ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును తన అసాధారణ బ్యాటింగ్తో, డాషింగ్ నాయకత్వంతో ప్లేఆఫ్కు చేర్చాడు. తాజాగా ఢిల్లీ డేర్డేవిల్స్పై ఘనవిజయం సాధించి బెంగళూరు సగర్వంగా ప్లేఆఫ్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో మరో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు కీలక విజయాన్ని అందించిన కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సింగిల్ ఐపీఎల్ సీజన్లో 900 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో టాప్ స్కోర్ చేసిన బ్యాట్స్మన్గా బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ పేరిట రికార్డు ఉంది. 2012లో 15 మ్యాచ్లు ఆడి గేల్ 733 పరుగులు చేశాడు. కానీ ప్రస్తుత ఐపీఎల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన కోహ్లి అప్పుడే 900 పరుగుల మార్క్ను దాటాడు. రికార్డులే రికార్డులు.. ప్రస్తుత ఐపీఎల్లో కోహ్లి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సెంచరీలు చేసి ఒకే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్ గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో మొత్తంగా 4వేల పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా సురేశ్ రైనాను అధిగమించినప్పటికీ.. రైనా కూడా ధాటిగా పరుగులు చేస్తుండటంతో ఇప్పుడా రికార్డు రైనా-కోహ్లి మధ్య దోబుచులాడుతోంది. భీకర ఫామ్ను కొనసాగిస్తూ పరుగుల యంత్రంలా ప్రతి మ్యాచ్లోనూ ధాటిగా ఆడుతున్న కోహ్లి ప్రస్తుత ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. అతనొక్కడి వల్లే బెంగళూరు జట్టు ప్లేఆఫ్కు వెళ్లిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. -
కట్టి‘బెట్టు’డు కానరాదే..!
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: ఐపీఎల్ బెట్టింగ్ దందా నెలరోజులుగా జిల్లాలో భారీగా సాగుతోంది. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక్కో మ్యాచ్పై రూ.వెయ్యి నుంచి రూ.ఐదు లక్షల వరకు బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా సరిహద్దు మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మరింత జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కృష్ణ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన కొంతమంది ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యసనం విద్యార్థుల్లోనూ వ్యాపిస్తోంది. ఇటీవల ఖమ్మం నగ రానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి తనకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బులతో ఐపీఎల్ బెట్టింగ్ కాసి చేతులు కాల్చుకున్నాడు. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు తమ తల్లితండ్రులు కొనిచ్చిన ల్యాప్టాప్లను, సెల్ఫోన్లను సైతం ఐపీఎల్ బెట్టింగ్ కోసం తాకట్టుపెడుతున్నట్లు తెలిసింది. ప్రముఖుల పిల్లలు కూడా తమ సరదా తీర్చుకోవడం కోసం విచ్చలవిడిగా ఈ తంతులో పాల్గొంటున్నారు. టెన్త్, ఇంటర్, డీగ్రీ కళాశాలలకు సెలవులు రావడం, మరికొన్ని ఇంజ నీరింగ్ కళాశాలలకు ప్రిపరేషన్ సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఈ మాయలో పడుతున్నారు. గతంలో కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్ ఈసారి మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించింది. కాకా హోటళ్లే అడ్డా... బెట్టింగ్ తంతు ఎక్కువగా చిన్న చితకా హోటళ్లు, బార్షాపుల లో జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఇలాంటి చోటైతే ఎవరికీ అనుమానం రాదని భావించిన కొందరు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా నగరంలోని ప్రధాన లాడ్జీలు, రెస్టారెంట్లు వేలకు వేలు అద్దెలు వసూలు చేస్తూ బెట్టింగ్ రాయుళ్లకు ఆశ్రయం ఇస్తున్నట్లు తెలిసింది. పట్టించుకోని అధికారులు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవారం రోజుల్లో ఐపీఎల్ ముగుస్తుడండంతో ఈ జోరు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిస్థితి మరింత తీవ్రం కాకముందే అడ్డుకట్ట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
కాయ్.. రాజా.. కాయ్!
పరిగి, న్యూస్లైన్: పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ జడలు విచ్చుకుంది. ఒక ప్పుడు పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్లు నేడు పరిగికి కూడా పాకింది. ఈ జాడ్యం గత ఐపీఎల్ సీజన్లో ప్రారంభమవగా ప్రస్తుతం కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో వేళ్లూనుకుంటోంది. ప్రస్తుతం జనమంతా ఎన్నికలో హడావుడిలో మునిగిపోగా క్రికెట్పై ఆసక్తి ఉన్న యువకులు బెట్టింగ్కు బావినసవుతూ రూ. వేలకువేలు వెచ్చిస్తున్నారు. బెట్టింగులు ఇలా.. క్రికెట్ బెట్టింగ్ల గురించి వినడమే గాని చాలా మందికి దానికి గురించి తెలియదు. బాల్ టూ బాల్... ఓవర్ టూ ఓవర్.. మ్యాచ్ టూ మ్యాచ్ ఇలా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. పలానా బాల్ పలానా బ్యాట్స్మన్ సిక్స్, లేదా ఫోర్ కొడతాడని ఫోన్లో బెట్ కట్టడం, లేదా పలానా బ్యాట్స్మన్ పలానా ఓవర్లో 10 పరుగులు, లేదా 20 పరుగులు ఆపైనా సాధిస్తాడు. లేదా దేశాల మధ్య జరిగే మ్యాచ్లో పలానా దేశం విజయం సాధిస్తుంది. పలానా బ్యట్స్మన్ హాఫ్ సెంచరీ సాధిస్తాడు.. ఇలా పలు రూపాల్లో బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. మ్యాచ్ టూ మ్యాచ్ బెట్ కట్టే వారు ముందుగానే మధ్యవర్తుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉంటు ంది. గెలిస్తే చెల్లించిన డబ్బులకు డబుల్ అమౌంట్ నిర్వహకులు ఆన్లైన్లోనే చెల్లిస్తారు. లేదంటే ముందుగా కట్టిన డబ్బులు పోతాయి. ఓవర్ టూ ఓవర్, బాల్ టూ బాల్.. బెట్టింగ్ విషయానికి వస్తే ఓవర్కు ముందు, బాల్కు ముందు ఫోన్ చేసి బెట్ కట్టాల్సి ఉంటుంది. కొందరు నిర్వాహకులు బ్రోకర్ను నియమించి అతని ద్వారా లేవాదేవీలు జరుపుతుంటారు. గెలిస్తే మరుసటి రోజు అతను డబ్బులు తెచ్చి ఇస్తుంటాడు. ఓడితే డబ్బులు తీసుకువెళ్తాడు. పరిగిలో ప్రస్తుతం బెట్టింగ్ ఇలా కొనసాగుతోంది. యువత, ఉద్యోగులపై వల... బెట్టింగ్ నిర్వాహకులు హైదరాబాద్లో ఉండి కొందరు మధ్యవర్తుల ద్వారా ప్రధానంగా క్రికెట్ అంటే క్రేజ్ ఉన్న యువకులు, ఉద్యోగులను ఎంచుకుని ముగ్గులోకి దింపుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో పరిగికి చెందిన 30-50 మంది వరకు బెట్టింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆ సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.