
పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదం
మిగులు స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎంలుగా నియమించేందుకు విద్యాశాఖ యత్నం
ఇప్పటివరకు స్పష్టమైన బదిలీ విధానాన్ని ప్రకటించని సర్కారు
ఉపాధ్యాయ వర్గాల ప్రతిపాదనను పట్టించుకోని అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయ బదిలీలపై గందరగోళం నెలకొంది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మోడల్ ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా పీఎస్ హెచ్ఎం (ప్రైమరీ స్కూల్) పోస్టుల భర్తీకి నిబంధనలు విడుదల చేసింది. ఇందులో.. 4,706 మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పీఎస్ హెచ్ఎం పోస్టులుగా మార్పుచేసింది. వీటిల్లో జిల్లా పరిషత్ యాజమాన్యానికి 4,556.. ప్రభుత్వ యాజమాన్యానికి 55, మున్సిపాలిటీ యాజమాన్యానికి 95 పోస్టులు చొప్పున మంజూరుచేసింది.
ఇప్పుడీ పోస్టుల భర్తీలో విద్యాశాఖ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. దీనివల్లే సరైన బదిలీల విధానాన్ని విద్యాశాఖ ఇప్పటివరకు బహిర్గతం చేయట్లేదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పైగా.. తమ ప్రతిపాదనలను పట్టించుకోకుండా విద్యాశాఖ ప్రతిపాదించిన అంశాలనే ఖరారు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపిస్తున్నాయి.
విద్యాశాఖ ప్రతిపాదనలు ఇలా..
» జిల్లాల వారీగా కన్వర్షన్ చేసిన పీఎస్ హెచ్ఎంల పోస్టులను మిగులు సబ్జెక్టు పోస్టుల సంఖ్య నిష్పత్తి ప్రకారం పంపిణీ చేస్తారు. ఏ సబ్జెక్టుకు ఎన్ని అని కేటాయిస్తారే తప్ప ఏ సబ్జెక్టుకు ఏ ఖాళీ అనేది నిర్ధారించరు. అనంతరం.. బదిలీకి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు ఉపాధ్యాయుల్లో పీఎస్ హెచ్ఎం పోస్టు కోరుకునే వారి నుంచి సమ్మతి తీసుకుంటారు. సమ్మతి తెలిపిన వారిని సబ్జెక్టు బదిలీ జాబితాలోకి అనుమతించరు.
» తదుపరి.. సమ్మతి ఇచి్చన అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయుల సమ్మిళిత సీనియారిటీ జాబితా తయారుచేసి పీఎస్ హెచ్ఎం బదిలీలకు శ్రీకారం చుడతారు. ఈ ప్రక్రియకు ముందు బదిలీలకు దరఖాస్తు చేసుకుని ఇప్పటికే పనిచేస్తున్న పీఎస్ హెచ్ఎంల బదిలీలు జరుపుతారు. మిగిలిన ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు ప్రదర్శిస్తారు. ఈ రెండో ప్రతిపాదన ఇష్టంలేని స్కూల్ అసిస్టెంట్లను వారి సబ్జెక్టు బదిలీలకు, సమ్మతి ఇచ్చి బదిలీకి నోచుకోని వారిని కూడా సబ్జెక్టువారీ బదిలీలకు అనుమతిస్తారు. రెండు ప్రతిపాదనల్లోనూ ఎవరి సమ్మతిలేని పక్షంలో జాబితా చివరి ఉపాధ్యాయులకు కచ్చితంగా స్థానం కల్పిస్తారు.
మిగులు ఎస్ఏలకు ప్రాధాన్యత కల్పించాలి..
ఇదిలా ఉంటే.. పీఎస్ హెచ్ఎం ఖాళీల భర్తీలో మిగులు స్కూల్ అసిస్టెంట్లకు ప్రాధాన్యత కల్పించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు.
ఉపాధ్యాయ సంఘాలను పట్టించుకోని విద్యాశాఖ..
ఇక విద్యాశాఖ ఇచ్చిన ఈ రెండు ప్రతిపాదనల్లో రెండో దానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మొగ్గుచూపగా మరికొన్ని వీటికంటే ఉత్తమమైన మార్గాన్ని చూపించాలని కోరాయి. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో సబ్జెక్టుల వారీగా పీఎస్ హెచ్ఎం ఖాళీలను బదలాయింపు చేసిన తర్వాత మండల స్థాయిలో కూడా సబ్జెక్టుల వారీగా ఖాళీలను విభజించాలని.. తద్వారా సబ్జెక్టుల వారీగా బదిలీలకు ఆప్షన్లను ఆహ్వానించాలని ప్రతిపాదించాయి. దీన్ని విద్యాశాఖ నిర్ద్వందంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మూడో ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చాయి. మిగులు ఖాళీల సర్దుబాటుతో ఏర్పడిన పీఎస్ హెచ్ఎం ఖాళీల భర్తీలో మిగులు ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలని ప్రతిపాదిస్తున్నాయి. ఇప్పటికే బదిలీలకు దరఖాస్తు చేసుకున్న పాత పీఎస్ హెచ్ఎంలను, మిగులు స్కూల్ అసిస్టెంట్ల సమ్మిళిత జాబితాతో పాటు పదోన్నతికి అనుమతించిన ఉపాధ్యాయుల జాబితాను అనుసంధానం చేసి ఉమ్మడి సీనియారిటీ జాబితాతో పీఎస్ హెచ్ఎం ఖాళీలను భర్తీచేయాలని కోరుతున్నాయి.
తద్వారా సీనియారిటీ పాయింట్ల ప్రతిభతో పాటు మిగులు ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందని చెబుతున్నారు. ఇక బదిలీకి నోచుకోని స్కూల్ అసిస్టెంట్లు యథాతథంగా ఆయా సబ్జెక్టుల బదిలీల జాబితాలోకి వెళ్లేలా చూడాలని విద్యాశాఖ ముందుకు కొత్త ప్రతిపాదనలు తెస్తున్నారు. ఇలా చేయడంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, మొత్తం ప్రక్రియ సులభతరం అవుతుందని చెబుతున్నారు.