ముందు టార్గెట్లు.. తర్వాత రికవరీలు | Concerns of Employment Guarantee Scheme employees | Sakshi
Sakshi News home page

ముందు టార్గెట్లు.. తర్వాత రికవరీలు

Apr 12 2025 4:24 AM | Updated on Apr 12 2025 4:24 AM

Concerns of Employment Guarantee Scheme employees

ఉపాధి హామీ పథకం ఉద్యోగుల ఆందోళన 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది పరిస్థితి ‘ముందు నుయ్యి... వెనుక గొయ్యి..’ అన్న చందంగా మారిందని ఉద్యోగుల జేఏసీ ఆందోళన వ్యక్తంచేసింది. ఉపాధి హామీ పథకం అమలులో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పనిచేసే టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ), ఏపీవో, ఈసీ, జేఈ, ఎంటీసీ, ఏపీడీ, బీఎఫ్‌టీ తదితర కేటగిరీ ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. 

‘ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మొదట కూలీల రోజు­వారీ వేతనం గరిష్ట మొత్తంలో ఉండాలని టార్గెట్లు పెడుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత విజిలెన్స్‌ విచారణ, సోషల్‌ ఆడిట్‌ పేరుతో చేసిన పని కంటే కూలీలకు ఎక్కువ మొత్తంలో వేతనాల బిల్లులు నమోదు చేశారంటూ ఉద్యోగుల జీతాల నుంచి రికవరీకి సిఫార్సులు చేస్తున్నారు..’ అని ఉద్యోగుల జేఏసీ నాయకులు తప్పుపట్టారు. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న దాదాపు 7వేల మందికి ఉద్యోగ భద్రత కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. 

కేటగిరీల వారీగా ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు గ్రేడ్‌ ఫిక్స్‌ చేయాలని, 23 శాతం పీఆర్సీ వర్తింపజేయాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్, నగదు రహిత హెల్త్‌ కార్డులు ఇవ్వాలని జేఏసీ తీర్మానించింది. సమావేశం అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం అమలు డైరెక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌లను జేఏసీ ప్రతినిధులు కలిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ నెలాఖరు నాటికి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని, లేకపోతే ఉద్యోగులందరం ఐక్యంగా పోరాటం సాగిస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement