సమగ్ర భూసర్వేను పక్కాగా నిర్వహించాలి : సీఎం జగన్‌

CM YS Jaganmohan Reddy Review Meeting On Comprehensive Land Survey - Sakshi

భూ సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షా సమావేశం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాశ్వతంగా భూహక్కు కల్పించే సమగ్ర సర్వేకు సంబంధించిన ఏర్పాట్లు, టైటిల్‌ తదితర వివరాలతో పాటు, కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను సమావేశంలో అధికారులు వైఎస్‌ జగన్‌కు వివరించారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..'శాశ్వత భూహక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం.దీన్ని పక్కాగా నిర్వహించాలి.ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న సమగ్ర భూసర్వే మొదలు కావాలి. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోంది, దీనివల్ల రాష్ట్రంలో పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్‌ అవుతుంది.అత్యాధునిక టెక్నాలజీ.. డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం.త్వరలోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలి. అలాగే సచివాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. గతంలో రికార్డులు ట్యాంపర్‌ చేయడానికి చాలా అవకాశం ఉండేది, ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. ఎవ్వరు కూడా రికార్డులు తారుమారు (ట్యాంపర్‌) చేసే అవకాశం లేకుండా డిజిటైజేషన్ జరుగుతుందని' ‌ పేర్కొన్నారు.( చదవండి : రూ.40కి కేజీ ఉల్లి అందించనున్న ఏపీ ప్రభుత్వం)

కాగా, అంతకు ముందు సమీక్షా సమావేశంలో అధికారులు పలు అంశాలను వివరించారు. వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని,  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు పని చేస్తాయని వారు వెల్లడించారు. భౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్‌) ద్వారా శాటిలైట్ ఫోటోలు పొందడం, ఆ ఇమేజ్‌ను ప్రాసెస్‌ చేయడం, క్షేత్రస్థాయి పరిశీలన, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. డ్రోన్ల ద్వారా స్పష్టంగా గ్రామ కంఠాలను జీఐఎస్‌ ద్వారా ఫోటో తీస్తామని పేర్కొన్నారు.(చదవండి : అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధేంటి?)

వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో జనవరి 2023 నాటికి పూర్తవుతుందని, మూడు దశల్లో సర్వే కొనసాగుతుందని వివరించారు. సమగ్ర భూసర్వే కోసం 70 కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్(బేస్‌ స్టేషన్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్నింటిని ఏర్పాటు చేశామని తెలిపారు.మొబైల్‌ (విలేజ్‌) కోర్టులు కూడా ఏర్పాటు అవుతున్నందున వివాదాలు కూడా ఎక్కడికక్కడే వేగంగా పరిష్కారమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ప్రసాద్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ ఐజీ సిద్థార్థజైన్‌తో పాటు, రెవెన్యూ శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top